- దుకాణాల షెడ్లు ధ్వంసం, రైళ్ల రాకపోకలకు అంతరాయం
చిన్న చింతకుంట, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో సంతలో ఏర్పాటు చేసిన దుకాణాల షెడ్లు ధ్వంసమయ్యాయి. వ్యాపారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రైల్వే విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవరకద్ర మండల కేంద్రంలో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఏపీలోని తిరుపతికి చెందిన జగన్నాథ్ రెడ్డి (45), పశ్చిమ బెంగాల్కు చెందిన కారు డ్రైవర్ సంతోష్(40) ఎస్బీఐ ముందు ఉన్న భవనం సమీపంలో కారును పార్క్ చేశారు.
ఈ సమయంలో నాలుగో అంతస్తు గోడ ఒక్కసారిగా కూలి శిథిలాలు కారుపై పడటంతో వాహనంలో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు స్థానికుల సాయంతో తీవ్రంగా శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గాలివాన ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అధికారులు, పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
