
- సీఎంకు ఆ ధైర్యం లేదు: ఎమ్మెల్సీ కవిత
- కాళేశ్వరంలో కృష్ణారెడ్డి 20 పంప్హౌస్లు కట్టిండు
- కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటేతెలంగాణకు ఇచ్చినట్లే
- ధర్నా చౌక్ నిరసన దీక్షలో వ్యాఖ్యలు
ముషీరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేసీఆర్కు నోటీసులిచ్చిన ఈ ప్రభుత్వం మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి 20 పంప్ హౌస్ లు కట్టిండు. సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే ఆయనకు నోటీసులు ఇచ్చి కమిషన్ ముందుకు పిలవాలి’’ అంటూ సవాల్ చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలే కాదు.. పంపుహౌస్ లు కూడా ఉన్నాయి. కమీషన్ల కోసమే మేఘా కృష్ణారెడ్డికి ఈ సర్కార్ నోటీసులు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నది” అని దుయ్యబట్టారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో కవిత నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని, 90 శాతం పనులను మేఘా కృష్ణారెడ్డి కంపెనీకే కట్టబెట్టారని అన్నారు. ‘‘తెలంగాణ రైతాంగానికి నీళ్లిచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని సహించేది లేదు. అది కాళేశ్వరం కమిషన్కాదు.. కాంగ్రెస్ కమిషన్. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు.
నీళ్లు నిధులు తీసుకురావడమే కేసీఆర్ చేసిన తప్పా?” అని ప్రశ్నించారు. పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు సాధారణమేనని, కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు ఈ ప్రభుత్వం కావాలనే రిపేర్లు చేయంచడం లేదని, చిన్న లోపాలకు రిపేర్లు చేయించకుండా పొలాలను ఎండబెడుతున్నదని కవిత దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్ కలలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదు. కేసీఆర్ది గట్టి గుండె కాబట్టే కట్టిండు. ఆయనను బద్నాం చేయడానికే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారు” అని ఆరోపించారు.
బనకచర్లను ఎందుకు వ్యతిరేకిస్తలే
ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని కవిత ప్రశ్నించారు. ‘‘తన గురువు చంద్రబాబు గోదావరి జలాలను తరలించుకుపోతున్నడు కాబట్టే రేవంత్ మౌనంగా ఉన్నడు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే కేంద్రానికి ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నడు?” అని మండిపడ్డారు. గోదావరి, పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును వెంటనే అడ్డుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి లెటర్ రాయాలని డిమాండ్ చేశారు.
‘‘ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నందున జలదోపిడీ చేస్తున్నా.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర లీడర్లు ప్రశ్నించడం లేదు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేలేకపోతున్నరు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడకపోవడం శోచనీయం. ఆ ప్రాజెక్టును ఆపే బాధ్యతను తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఈటల తీసుకురావాలి” అని డిమాండ్ చేశారు. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించేవరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు.