మండలిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వాకౌట్.. ప్రతిపక్ష సభ్యుల నిరసనల నడుమ ప్రైవేట్ వర్సిటీస్ బిల్లు పాస్

మండలిలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వాకౌట్..  ప్రతిపక్ష సభ్యుల నిరసనల నడుమ  ప్రైవేట్ వర్సిటీస్ బిల్లు పాస్

హైదరాబాద్, వెలుగు: శాసన మండలిలోనూ బీఆర్‌‌‌‌ఎస్‌‌ సభ్యులు వాకౌట్​ చేశారు. శనివారం  ప్రతిపక్ష ఎమ్మెల్సీల నిరసన మధ్య ‘ది తెలంగాణ ప్రైవేట్  యూనివర్సిటీస్  ఎస్టాబ్లిష్​మెంట్  అండ్  రెగ్యులరేషన్  అమెండ్‌‌మెంట్  బిల్–2026’ పాస్  అయింది. ప్రశ్నోత్తరాలు, స్పెషల్​ మెన్షన్​ ప్రోగ్రాం​పూర్తయిన వెంటనే బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు యూరియాపై చర్చకు పట్టుబడ్డారు. దీనిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్​ చదివి రిజెక్ట్​ చేశారు.

శుక్రవారమే మండలిలో యూరియాపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేట్​ యూనివర్సిటీస్​ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మండలిలో ప్రవేశపెట్టి..  అందులోని అంశాలను చదివి వినిపించారు.  సభలో ఉన్న 11 మంది బీఆర్ఎస్​ఎమ్మెల్సీలు నినాదాలు చేసుకుంటూ పోడియం వద్దకు వచ్చారు.  వారి నిరసనల మధ్యనే మండలి చైర్మన్​ సభ్యుల ఆమోదంతో బిల్​ పాస్​ అయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత సభకు లంచ్​ బ్రేక్​ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్​ ఎమ్మెల్సీలు మిగిలిన సెషన్స్‌‌లో పాల్గొనకుండా బైకాట్​ చేసి వెళ్లిపోయారు. కాగా, శాసనమండలి తొలి సెషన్​ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది.  మంత్రి వాకిటి శ్రీహరి తొలిసారి రాగా.. మండలి తరఫున చైర్మన్​ శుభాకాంక్షలు తెలిపారు.