
- రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్ కేసీఆర్
- నిరుడు వచ్చినా.. ఇప్పుడు రాలే
- అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్
- పార్టీకి దూరంగా.. జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు
- తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన మధుసూదనాచారి.. పాల్గొన్న హరీశ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అవతరణ వేడుకల వేళ బీఆర్ఎస్ పార్టీ పెద్దల తీరు ఎవరికి వారే అన్నట్లుగా తయారైంది. తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకునే గులాబీ బాస్ కేసీఆర్.. అసలు వేడుకల్లోనే పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫారిన్ టూర్కు వెళ్లారు. ఇక కవిత.. జాగృతి ఆఫీసులో సొంతంగా వేడుకలు నిర్వహించారు. హరీశ్రావు తప్ప.. కేసీఆర్ ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనలేదు.
ఫామ్హౌస్కే కేసీఆర్ పరిమితం
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక.. ఆ మరుసటి ఏడాది తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి అప్పటికే కేసీఆర్తుంటి ఎముక విరిగింది. దాదాపు ఆరు నెలల విశ్రాంతి తర్వాత ఆయన తెలంగాణ భవన్కు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఒకట్రెండు సార్లు తప్ప ఏనాడూ అసెంబ్లీ ముఖం చూడలేదు. ఇక, ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ పాల్గొనలేదు. సోమవారం కూడా ఫామ్హౌస్కే పరిమితమయ్యారు. కవిత లేఖ, ఆ తర్వాతి ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని, వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమోనని పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేడర్ భావించింది. అయితే వారికి నిరాశే ఎదురైంది. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాత్రం అటెండయ్యారు.
అమెరికాలో కేటీఆర్
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉత్సవాలకు రాకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ నేతృత్వంలో వేడుకలను నిర్వహించేవారు. కానీ, ఈసారి కేటీఆర్ అవతరణ వేడుకలకు రాష్ట్రంలో లేరు. ఇంగ్లండ్, అమెరికా టూర్కు వెళ్లారు. రెండు రోజుల కింద ఇంగ్లండ్ టూర్ను ముగించుకుని.. ఇప్పుడు అమెరికాకు చేరుకున్నారు. అక్కడ డల్లాస్లో అక్కడివాళ్లు నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో, అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్తున్నా.. రాష్ట్రంలో మాత్రం అవతరణ వేడుకల్లో పాల్గొనకపోవడమేమిటని పార్టీలోనూ చర్చ జరుగుతున్నది.
సొంతంగా కవిత
కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీతో కవిత ఎడమొహం.. పెడమొహం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి ఆమె తన విమర్శలకు పదును పెంచారు. ఏకంగా సొంత అన్న, బావనే లక్ష్యంగా చేసుకుని చిట్చాట్లో కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ కేడర్నూ ఆమె దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ జరుగుతున్నది. కనీసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకైనా కవిత తెలంగాణ భవన్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఆమె తెలంగాణ భవన్లో వేడుకలకు హాజరు కాలేదు. ఇటీవల తన ఇంటి పక్కనే కొత్తగా ప్రారంభించిన జాగృతి ఆఫీసులో సోమవారం రాష్ట్ర అవతరణ వేడుకలను కవిత నిర్వహించారు. అనంతరం జాగృతి ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలోనూ పాల్గొన్నారు.
జెండా ఎగరేసిన మధుసూదనాచారి
తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ, కేసీఆర్గానీ, కేటీఆర్గానీ, కవితగానీ లేకపోవడంతో కేడర్ నిరాశకు లోనయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే అవతరణ వేడుకలా? అధికారంలో లేనప్పుడు అవసరం లేదా? అని పలువురు నేతల మధ్య చర్చ జరిగింది.