బీఆర్​ఎస్​లో ఎవరికివారే.!రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్​ కేసీఆర్​

బీఆర్​ఎస్​లో ఎవరికివారే.!రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్​ కేసీఆర్​
  • రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్​ కేసీఆర్​
  • నిరుడు వచ్చినా.. ఇప్పుడు రాలే
  • అమెరికా టూర్​లో ఉన్న కేటీఆర్​
  • పార్టీకి దూరంగా.. జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు
  • తెలంగాణ భవన్​లో జెండా ఎగరేసిన మధుసూదనాచారి.. పాల్గొన్న హరీశ్​

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ అవతరణ వేడుకల వేళ బీఆర్​ఎస్​ పార్టీ పెద్దల తీరు ఎవరికి వారే అన్నట్లుగా తయారైంది. తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకునే గులాబీ బాస్​ కేసీఆర్.. అసలు వేడుకల్లోనే పాల్గొనలేదు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఫారిన్​ టూర్​కు వెళ్లారు.  ఇక కవిత.. జాగృతి ఆఫీసులో సొంతంగా వేడుకలు నిర్వహించారు. హరీశ్​రావు తప్ప.. కేసీఆర్​ ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ తెలంగాణ భవన్​లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనలేదు.

ఫామ్​హౌస్​కే కేసీఆర్​ పరిమితం

కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక.. ఆ మరుసటి ఏడాది తెలంగాణ భవన్​లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి అప్పటికే కేసీఆర్​తుంటి ఎముక విరిగింది. దాదాపు ఆరు నెలల విశ్రాంతి తర్వాత ఆయన తెలంగాణ భవన్​కు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఒకట్రెండు సార్లు తప్ప ఏనాడూ అసెంబ్లీ ముఖం చూడలేదు. ఇక, ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ పాల్గొనలేదు. సోమవారం కూడా ఫామ్​హౌస్​కే పరిమితమయ్యారు. కవిత లేఖ, ఆ తర్వాతి ఎపిసోడ్​ నేపథ్యంలో కేసీఆర్​ బయటకు వస్తారని, వేడుకల్లో పాల్గొని  ఏదైనా మాట్లాడతారేమోనని పార్టీ సీనియర్​ నాయకులతో పాటు కేడర్​ భావించింది. అయితే వారికి నిరాశే ఎదురైంది.  పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాత్రం అటెండయ్యారు. 

అమెరికాలో కేటీఆర్

పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్​ ఉత్సవాలకు రాకుంటే.. వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్న కేటీఆర్​ నేతృత్వంలో వేడుకలను నిర్వహించేవారు. కానీ, ఈసారి కేటీఆర్ అవతరణ వేడుకలకు రాష్ట్రంలో లేరు. ఇంగ్లండ్​, అమెరికా టూర్​కు వెళ్లారు. రెండు రోజుల కింద ఇంగ్లండ్​ టూర్​ను ముగించుకుని.. ఇప్పుడు అమెరికాకు చేరుకున్నారు. అక్కడ డల్లాస్​లో అక్కడివాళ్లు నిర్వహించిన బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో, అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెప్తున్నా.. రాష్ట్రంలో మాత్రం అవతరణ వేడుకల్లో పాల్గొనకపోవడమేమిటని పార్టీలోనూ చర్చ జరుగుతున్నది. 

సొంతంగా కవిత

కొద్ది రోజులుగా బీఆర్​ఎస్​ పార్టీతో కవిత ఎడమొహం.. పెడమొహం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి ఆమె తన విమర్శలకు పదును పెంచారు. ఏకంగా సొంత అన్న, బావనే లక్ష్యంగా చేసుకుని చిట్​చాట్​లో కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ కేడర్​నూ ఆమె దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ జరుగుతున్నది. కనీసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకైనా కవిత  తెలంగాణ భవన్​ వస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఆమె తెలంగాణ భవన్​లో వేడుకలకు హాజరు కాలేదు. ఇటీవల తన ఇంటి పక్కనే కొత్తగా ప్రారంభించిన జాగృతి ఆఫీసులో సోమవారం రాష్ట్ర అవతరణ వేడుకలను కవిత నిర్వహించారు. అనంతరం జాగృతి ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. 

జెండా ఎగరేసిన మధుసూదనాచారి

తెలంగాణ భవన్​లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్​ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ, కేసీఆర్​గానీ, కేటీఆర్​గానీ, కవితగానీ లేకపోవడంతో కేడర్​ నిరాశకు లోనయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే అవతరణ వేడుకలా? అధికారంలో లేనప్పుడు అవసరం లేదా? అని పలువురు నేతల మధ్య చర్చ జరిగింది.