కారుకు టక్కర్! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘోర పరాజయం

కారుకు టక్కర్! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘోర పరాజయం
  • సెంటిమెంట్​తో కొట్టాలని చూసినా వర్కవుట్​ కాలే
  • బాకీ కార్డుల వ్యూహం, హైడ్రాపై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఫెయిల్​
  • కేటీఆర్​ ప్రచారం ప్రభావం చూపలే.. కేసీఆర్​ ఫామ్​హౌస్​ వ్యూహాలు ఫలించలే
  • గులాబీ ఖాతాలోంచి మరో సిట్టింగ్​ సీటు మాయం

హైదరాబాద్​, వెలుగు: గులాబీ పార్టీకి మరో బిగ్​ షాక్​ తగిలింది. ఎక్కడైతే తాను స్ట్రాంగ్​గా ఉన్నానని చూసి కారు మురిసిపోయిందో.. అక్కడ్నే టక్కరై ఆగిపోయింది. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ చేతిలో బీఆర్​ఎస్​ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మరో సిట్టింగ్​ స్థానాన్ని కోల్పోయింది. మాగంటి గోపీనాథ్​ అకాల మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్​ బైపోల్​లో.. ఆయన భార్య సునీతకే బీఆర్​ఎస్​ టికెట్​ ఇచ్చి బరిలో నిలిపింది. సిట్టింగ్​ స్థానంలో బంపర్​ మెజారిటీతో గెలుస్తామని ముందు నుంచీ బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చెప్తూ వచ్చారు. 

సెంటిమెంట్​ వాడినా, బాకీ కార్డులు పంచినా, హైడ్రాపై విమర్శలు చేస్తూ సమావేశాలు పెట్టినా, గల్లీగల్లీకి కేటీఆర్​ తిరిగినా బీఆర్​ఎస్​ను గట్టెక్కించలేకపోయాయి. ఫామ్​హౌస్​ నుంచే బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ వ్యూహాలు పన్నుతున్నారని చెప్పినా.. అవీ ఫలించలేదు. మొత్తంగా గులాబీ పార్టీ.. సంఖ్యాబలం మరొకటి తగ్గి ఢీలా పడిపోయింది. 

సెంటిమెంట్​ అస్త్రాన్ని ప్రయోగించి..!

అభ్యర్థిని ప్రకటించింది మొదలు బీఆర్​ఎస్​ పార్టీ సెంటిమెంట్​నే ప్రయోగించింది. గోపీనాథ్​ మృతితో వచ్చిన ఉప  ఎన్నికలో ఆయన భార్య సునీతను గెలిపించుకోవాలని ప్రతి మీటింగ్​లోనూ చెప్పుకుంటూ వచ్చింది. ఆడబిడ్డ అనే సెంటిమెంట్​నూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆడబిడ్డపై అందరూ కలిసి దాడి చేస్తున్నారంటూ కేటీఆర్​ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చినా.. మరి వాళ్ల సొంత ఇంటి ఆడబిడ్డపై అడుగడుగునా చేసిన దాడుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్న చర్చ జనాల్లో ఆలోచన రేకెత్తించింది. 

బాకీ కార్డులు వేస్ట్

కాంగ్రెస్​ పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్​ఎస్​ వాడుకున్న మరో అస్త్రం బాకీ కార్డులు. ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కేటీఆర్​, హరీశ్​ సహా బీర్​ఎస్​ నేతలు జనంలోకి వెళ్లారు. ప్రజలకు కాంగ్రెస్​ అనేక హామీలు అమలు చేయక బాకీ పడిందంటూ ‘బాకీ కార్డులు’ల పేరిట ప్రత్యేకంగా పాంప్లెట్లు ముద్రించి పంచింది. బీఆర్​ఎస్​ నేతలు ఇంటింటికీ తిరిగి వీటిని అందజేశారు. ఆ బాకీ కార్డులను జనం పట్టించుకోలేదు. బీఆర్​ఎస్​ హయాంలో ఎన్నో హామీలు అమలు కాలేదని, ఇప్పుడు బాకీ కార్డులంటూ ముందుకు వస్తున్నారంటూ తిప్పికొట్టారు.  

హైడ్రాపై ఆరోపణలతో వెళ్లినా..!

హైడ్రా చేపడ్తున్న అక్రమాల కూల్చివేతలనూ బీఆర్​ఎస్​ పార్టీ తన ప్రచారానికి వాడుకున్నది. కాంగ్రెస్​ది కూల్చే ప్రభుత్వమని కేటీఆర్​ పదే పదే ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. జూబ్లీహిల్స్​ ఫైట్​ కారు వర్సెస్​ బుల్డోజర్​ అంటూ ప్రచారం చేశారు. ‘‘పేదల ఇండ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం పెద్దల ఇండ్ల జోలికి వెళ్లడం లేదు” అంటూ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్​లో హైడ్రాపై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. పలువురితో మాట్లాడిచ్చారు. హైడ్రాపై చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. పైగా, హైడ్రా వచ్చాక సిటీలో కబ్జాలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం స్థానిక జనంలో కనిపించింది. 

దెబ్బకొట్టిన ‘ఫ్యామిలీ’ వివాదం 

మాగంటి గోపీనాథ్​ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు కూడా బీఆర్​ఎస్​ను దెబ్బకొట్టాయి. తన కొడుకు గోపీనాథ్​ మరణంపై అనుమానాలున్నాయని తల్లి పోలీసులను ఆశ్రయించింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్​ ఇవ్వడంపై గోపీనాథ్​ మొదటి భార్య మాలినీదేవి, కుమారుడు ప్రద్యుమ్న తారక్​ మీడియా ముందుకు వచ్చారు. మొదటి భార్యను తానున్నాక సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్​ ఎలా ఇస్తారంటూ  మాలినీదేవి ప్రశ్నించారు. ఈ విషయంలో తమను బీఆర్​ఎస్​ నేతలు బెదిరిస్తున్నారంటూ వాళ్లు ఆరోపణలూ చేశారు. ఇటు గోపీనాథ్​ తల్లి  మహానంద కుమారి కూడా మీడియా ముందుకు వచ్చి.. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్​ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానంద కుమారి, మాలినీ దేవి, ప్రద్యుమ్న తారక్​ కలిసి శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు సైతం చేశారు.  

కేటీఆర్​ చక్కర్లు కొట్టినా..కేసీఆర్ వ్యూహాలు రచించినా..!​

జూబ్లీహిల్స్​ బైపోల్​ ప్రచారం కోసం బీఆర్ఎస్​ పార్టీ కాంగ్రెస్​ కన్నా ముందుగానే గ్రౌండ్​లోకి దిగింది. డివిజన్ల వారీగా సీనియర్​ లీడర్లకు బాధ్యతలు అప్పగించింది. తలసాని శ్రీనివాస్​ యాదవ్​, వద్దిరాజు రవిచంద్ర, దాసోజు శ్రవణ్​, తక్కెళ్లపల్లి రవీందర్​, పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి వంటి నేతలకు వివిధ డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. వాళ్లు ముందు నుంచీ ప్రజలను కలుస్తూ కాంగ్రెస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటు కేటీఆర్​ కూడా వారం పది రోజుల పాటు ప్రతి డివిజన్​లోనూ రోడ్​షోలు నిర్వహించారు. కాంగ్రెస్​ చేసిన అక్రమాలంటూ వీడియోలు వేసి ప్రజలకు చూపించారు. 

అన్ని డివిజన్లలోనూ తిరిగారు. ఇటు హరీశ్​ రావు కూడా యూసుఫ్​గూడ డివిజన్​లో బైక్​ ర్యాలీ చేపట్టారు. ఇవేవీ బీఆర్​ఎస్​ను కాపాడలేకపోయాయి. మరోవైపు గులాబీ బాస్​ కేసీఆర్​ మాత్రం ఫామ్​హౌస్​కే పరిమితమైపోయారు. అభ్యర్థి ఎంపిక సహా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫామ్​హౌస్​ నుంచే చేశారు. లీడర్లను అక్కడికే పిలిపించుకుని రివ్యూలు నిర్వహించారు. స్టార్​ క్యాంపెయినర్​ లిస్టులో ఆయన పేరు ఉన్నప్పటికీ ప్రచారానికి రాలేదు. గ్రౌండ్​లోకి రాకుండా ఫామ్​హౌస్​కే పరిమితం కావడంతో జనంలోనూ కేసీఆర్​పై ఓ రకమైన అభిప్రాయం ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి.