
ఆ నలుగురు చేసిన అక్రమాలపై ప్రజాప్రభుత్వంలో విచారణలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం ఎలా వృథా అయింది. చివరకు కూలిపోయేవిధంగా జరిగిన ఆ నిర్మాణాల్లోని డొల్లతనాన్ని బయటపెడుతూ సాక్షాత్తూ నాటి ప్రభుత్వ సారథి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను కమిషన్ విచారించింది. ఇక అదే కుటుంబం నుంచి నెంబర్ 2గా కొనసాగిన కేటీఆర్ తన ఇష్టారీతి నిర్ణయాలతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏకంగా విదేశీ కంపెనీకి ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించి, నోటి మాట ద్వారా ఆదేశాలు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ విచారణ చేస్తోంది, అదే కుటుంబానికి చెందిన మరోవ్యక్తి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ ప్రాజెక్టు పనుల్లో కీలకపాత్ర పోషించిన హరీష్ రావు సైతం విచారణను ఎదుర్కొంటున్నారు.
ఏకంగా వ్యక్తిగత జీవితాలకు, స్వేచ్ఛకు విలువ లేకుండా చేసి సమాజంలోని ఎందరో ప్రముఖుల ఫోన్ సంభాషణలను రహస్యంగా విన్న ఫోన్ ట్యాపింగ్ కేసు సైతం విచారణలో ఉంది. ఇందులో అసలు దోషులెవరో బయటపడే తరుణం మరెంతో దూరంలో లేదు. ఇదీ ఆ కుటుంబం చేసిన తప్పులకు నేడు అనుభవిస్తున్న పరిణామాలు.
వీటినుంచి ప్రజలను తప్పుదోవ పట్టించాలనే తమ కుయుక్తుల్లో భాగంగా ఎప్పటికప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ప్రయత్నాలు తీవ్రరూపం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేస్ కేసు, కాళేశ్వరం కమిషన్, లిక్కర్ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతూ తీవ్ర ఆవేదనకు ఆ నలుగురు లోనవుతున్నారు. అందులో భాగంగానే ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరి విచక్షణను కోల్పోయి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలచే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అనడం ద్వారా యావత్ సమాజాన్ని అవమానిస్తున్నామనే సోయిని సైతం మర్చిపోతున్నారు.
తప్పులు, అప్పులు, వడ్డీలు
కాళేశ్వరంలో అప్పులు, - తప్పులతో పదేళ్లలో ఏడులక్షల కోట్ల అప్పులకుప్పగా రాష్ట్రాన్ని మార్చి ప్రజలకు తిప్పలు మిగిల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పార్టీ చేసిన ప్రతి తప్పిదాన్ని జాగ్రత్తగా సరిచేస్తూ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంవత్సరానికి వేలకోట్లను అప్పులకు మిత్తీలు కడుతూనే ఎక్కడా సంక్షేమాన్ని ఆగిపోనివ్వకుండా ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత సిలెండర్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగులకు డీఏ విడుదల, యువవికాసం ఇలా ఆరు గ్యారెంటీల అమలులో చిత్తశుద్ధిగా పనిచేస్తున్న సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ప్రజలకు వాస్తవాలు చెప్తున్నది తప్ప, వారిని మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం లేదు. ఈ నిజాయితీ వైఖరిని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతోందని కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
పేటెంట్ను వదిలేసి..
ఈ మధ్యకాలంలో కేటీఆర్.. ముఖ్యమంత్రిపై స్థాయిని మరిచి పరుష పదజాలం వాడుతున్నారు. వాడు, వీడు అనే సంస్కారంలేని భాషను వాడుతున్నారు. అయితే, అసలు సత్యాన్ని ఆయన గ్రహించడం లేదు. ఆయన మాటల్లో కనీస విషయం ఉండకపోవడం మరో వైచిత్రి. సీఎం రేవంత్ రెడ్డి జైతెలంగాణ అని అనరు అంటూ మాట్లాడడం, జై తెలంగాణ అని అనడమే కాదు ఆ స్ఫూర్తిని అమల్లోపెట్టి, ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తుందనేది తెలంగాణలో ఆ నలుగురికి తప్ప, ఎవరికైనా అర్థమవుతుంది.
వాస్తవానికి తెలంగాణ పేటెంటే కాంగ్రెస్ది. తెలంగాణ డీఎన్ఏలోనే కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరుమార్చుకొని ఇక తెలంగాణ అనేది తమ పేటెంట్ కాదనే వదిలేశారు. అధికారాన్ని కట్టబెట్టడానికి కారణమై న తెలంగాణనే తీసేసినవాళ్లను ప్రజలు ఏమనాలో ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ‘జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం’ అని తెలంగాణ ఖ్యాతిని కీర్తించిన గీతాన్ని గుర్తించడానికి ఆ నలుగురికీ ఏనాడూ మనసొప్పలేదు.
కాళ్లకు గజ్జెలుకట్టి, ఊరూరా తిరిగి తెలంగాణ నినాదాన్ని మార్మోగించిన గద్దరన్న ప్రగతిభవన్ గుమ్మం ముందు మూడు గంటలు కూర్చున్నా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని దుర్మార్గ చర్యను తెలంగాణ చూసింది. ఇప్పుడు ఆ గద్దరన్నను రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో ‘గద్దర్ తెలంగాణ సినీ అవార్డులు’ పేరుతో సినిమా రంగానికి గుర్తింపునిస్తూ ఆయన గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. ఈ అవార్డు పంక్షన్ లో సైతం ‘జయ జయహే తెలంగాణ’ గేయం సినీ ప్రముఖులందరి చేత పాడించి అందరితో జై తెలంగాణ అనిపించిన ఘనత ఇవాళ ప్రజా ప్రభుత్వానికి దక్కింది.
సర్వజనామోదంతో..
కోటి రూపాయల అవార్డుతోపాటు హైదరాబాద్లో 300 గజాల స్థలాన్ని సైతం వారికి ప్రజాప్రభుత్వం అందించింది. ఇది స్వీకరించిన తెలంగాణ ప్రముఖుల్లో గద్దర్ అన్న కుటుంబ సభ్యులతోపాటు, దివంగత గూడ అంజయ్య, బండి యాదగిరి కుటుంబ సభ్యులు అమరవీరుల స్తూపాన్ని రూపొందించిన ఎక్కా యాదగిరి, అందెశ్రీ, జయరాజు, పాశం యాదగిరిలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను సైతం ఘనంగా సన్మానించుకుంది. తెలంగాణ యోధులను స్మరించుకోవడంలో వారి కృషితోనే కానీ వారి ఇజాలతో సంబంధం లేదని చాటి చెప్పింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.
ఇది జై తెలంగాణ అనే మాటను ఆచరణలోకి తీసుకొచ్చిన చేతన బీఆర్ఎస్ డీఎన్ఏలో ఎన్నడైనా కనిపించిందా? అందుకే టీఆర్ఎస్ పేరులోని తెలంగాణను చెరిపేసి మేము కాదని ప్రజల ముందు నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణ పేరుతో పేగుబంధం ఏనాడో తెగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మొత్తం ఒక కుటుంబంలాంటిది. అరాచక కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తిని గౌరవించలేని కుసంస్కారం మంచిదికాదు. ఇది తెలంగాణ
ప్రజల సంకేతమని ఆ నలుగురు గమనించాలి.
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, ప్రాంతీయ వైవిధ్యం, తెలంగాణ జీవం ఇమిడి ఉన్న పాటను గుర్తించలేనివారికి తెలంగాణ సోయి ఎలా ఉన్నట్టు? ఇయ్యాల అదే అందెశ్రీ రాసిన ఆ గీతం సూర్యోదయంతోనే ప్రతి బడిలో గానోదయంగా మోగుతోంది. దేశ, విదేశ ప్రతినిధులు, గొప్ప వ్యక్తుల గొంతుల్లోంచి ప్రభుత్వం నిర్వహించే ప్రతి అధికారిక వేదికలపై ‘జయ జయహే తెలంగాణ’ ఇప్పుడు మారుమోగుతోంది. ఈ పాటను విని బీఆర్ఎస్ యజమానులు తట్టుకోలేకపోతున్నారా?
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో,
టిసాట్ నెట్వర్క్