న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో 50 వేల నుంచి 60 వేల అదనపు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. నెట్వర్క్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నౌ సమిట్ లో ఆయన తెలిపారు.
ఇప్పటికే ఉన్న 4జీ నెట్వర్క్ ను త్వరలోనే 5జీకి అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 8.55 కోట్ల నుంచి 9.27 కోట్లకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల త్రైమాసిక లాభాన్ని గడించిందని మంత్రి వెల్లడించారు.
2026 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తుందని సింధియా అన్నారు.
