
రెండోసారి కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంట్ చరిత్రలోనూ మరో రికార్డును సృష్టించింది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో రికార్డు స్థాయిలో బిల్లుల్ని ఆమోదించారు.
న్యూఢిల్లీ: 17వ లోక్సభ మొదటి సమావేశాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ రెండు డజన్లకుపైగా బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ఇంత పెద్దసంఖ్యలో బిల్లులు సభలో ప్రవేశపెట్టడం 15 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జులై 26 వరకు(శుక్రవారం) తీసుకుంటే మోడీ ప్రభుత్వం లోక్సభలో 30 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వీటిలో 20 బిల్లులు లోక్సభ ఆమోదం పొందాయి. 14 బిల్లుల్ని లోక్సభ, రాజ్యసభలు ఆమోదించాయి. 14వ లోక్సభ (2004) నుంచి16వ లోక్సభ (2014) వరకు మొదటి సమావేశాల్లో ఎలాంటి లెజిస్లేచర్ కార్యకలాపాలు జరగలేదు. జులై 5 నుంచి ఆగస్టు 26 వరకు సాగిన 2004 నాటి బడ్జెట్ సమావేశాల్లో కేవలం ఆరు బిల్లులు మాత్రమే పాస్ అయ్యాయి. 15వ లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో ఎనిమిది, 16వ లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో 12 బిల్లులకు మాత్రమే సభ ఆమోదం తెలిపింది .
ప్రతిపక్షాల ఫైర్
మెజార్టీ ఉందన్న నెపంతో ఎన్డీయే సర్కార్ ముఖ్యమైన బిల్లులపై చర్చలేకుండానే ఆమోదింపజేసుకుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వం ఆదరాబాదరాగా బిల్లుల్ని పాస్చేసుకున్నదే తప్ప వాటిని స్క్రూటినీ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అధికార పక్షం ఆ విమర్శల్ని తిప్పికొట్టింది. సభ ఆమోదిస్తే బిల్లుల్ని కమిటీలకు రిఫెర్ చేయడానికి తాము రెడీగా ఉన్నామని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.
17వ లోక్సభ బడ్జెట్ సెషన్స్ (జులై 26 వరకు)
- సభలో ప్రవేశపెట్టిన బిల్లులు: 30
- లోక్సభ ఆమోదం పొందినవి: 20
- రెండు సభల ఆమోదం పొందినవి:14