హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగకు సిటీ జనాలు సొంతూరి బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల17 వరకు స్కూళ్లకు, ఈ నెల13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో కుటుంబ సమేతంగా తరలివెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర బస్స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలు ఎక్కువ శాతం ప్రయాణిస్తుండటంతో బస్సుల్లో పుల్ రష్ ఉంటుంది. మరోవైపు ప్రైవేట్ వాహనాలు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. సొంత వాహనాల్లో తరలివెళ్లే వారితో టోల్గేట్ల వద్ద కూడా బారులు తీరి ఉంటున్నాయి.
చౌరస్తాల్లో.. బస్స్టేషన్లలో రద్దీ
పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్నిఏర్పాట్లు చేసింది. సిటీ నుంచి ప్రత్యేకంగా 700 బస్సులను నడుపుతోంది. సిటీ బస్సులను సైతం స్పెషల్గా జిల్లాలకు వేశారు. తమ సొంతూళ్లకు వెళ్తుండగా.. ప్రధాన చౌరస్తాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. మరో రెండు రోజుల్లో రద్దీ ఇంకా పెరగనుంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్లోని విజయవాడ బస్టాప్ వద్ద కలగకుండా షామియానాలు, కుర్చీలు, పబ్లిక్అడ్రస్ సిస్టం, మొబైల్టాయిలెట్స్ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా.. రద్దీ ఎక్కువగా ఉండే ఆరాంఘర్లో 6, ఉప్పల్లో16 , ఎల్బీనగర్లో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని బస్ భవన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు లింక్ చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు.
స్పెషల్ రైళ్లు..
రాష్ట్రంతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 7 నుంచే ఈ స్పెషల్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ నెల 27 వరకు 38 స్పెషల్ సర్వీసులను నడుపనుంది.