బస్సు టికెట్‌ ఖరీదు రూ. 15 లక్షలు

బస్సు టికెట్‌ ఖరీదు రూ. 15 లక్షలు

బస్సు టికెట్ మనం వెళ్లే దూరాన్ని బట్టి ఉంటుంది. అది కూడా మాగ్జిమమ్ వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు. అయితే ఈ బస్సు టికెట్‌ ఖరీదు మాత్రం అక్షరాల 15 లక్షల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ బస్సు న్యూఢిల్లీ నుండి బ్రిటన్‌ రాజధాని లండన్‌కు ప్రయాణిస్తోంది. 20 మంది ప్రయాణికులకు మాత్రమే వీలున్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక గైడ్‌, సహాయకుడు ఉంటారు. ప్రయాణికుల వీసా, భోజన, వసతి సదుపాయాలు మొత్తం ట్రావెల్స్‌ చూసుకుంటుంది. అందుకే టికెట్‌ ధరను రూ. 15 లక్షలుగా నిర్ణయించింది.

మొత్తం 18 దేశాల మీదుగా 70 రోజులపాటు మొత్తం 20 వేల కిలోమీటర్లు ఈ బస్సు ప్రయాణించనుంది. మయన్మార్‌, థారులాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఫ్రాన్స్‌ దేశాల మీదుగా జర్నీ చేయనుంది. ‘బస్‌ టు లండన్‌’ పేరుతో గుర్గాంకు చెందిన అడ్వెంచర్స్‌ ఓవర్‌ ల్యాండ్‌ అనే ట్రావెల్‌ సంస్థ ఈ బస్సును నడుపుతోంది. అయితే ఈ ఏడాది మే 21న ప్రయాణం ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా బ్రేక్‌ పడింది.