వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో నిరాశ పర్చిన సింధు

 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో నిరాశ పర్చిన సింధు

కోపెన్‌‌హగన్‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు.. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో నిరాశపర్చింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో 16వ సీడ్‌‌ సింధు 14–21, 14–21తో నజోమి ఒకుహర (జపాన్‌‌) చేతిలో ఓడింది. 44 నిమిషాల మ్యాచ్‌‌లో సింధు సర్వీస్‌‌ల్లో తేలిపోయింది. తొలి గేమ్‌‌లో 9–9తో స్కోరు సమం చేసిన తెలుగమ్మాయి ఆ తర్వాత వెనకబడింది. ఒకుహర కొట్టిన క్రాస్‌‌ కోర్టు ర్యాలీలను తీయడంలో తీవ్రంగా ఇబ్బందిపడింది. 

రెండో గేమ్‌‌ ఆరంభంలో సింధు పైచేయి సాధించింది. ఓ దశలో 9–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఒకుహర వరుసగా 5, 4, 6 పాయింట్లు నెగ్గి 15–12తో ముందంజ వేసింది. తర్వాత సింధు 2 పాయింట్లు నెగ్గినా, ఒకుహర ఆరు పాయింట్లతో ఈజీగా గేమ్‌‌ను గెలిచింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌం డ్‌‌లో లక్ష్యసేన్‌‌ 21–11, 21–12తో జియోన్‌‌ హ్యూక్‌‌ జిన్‌‌ (కొరియా)పై, ప్రణయ్​ 21–9, 21–14తో చికో వార్డోమో (ఇండోనేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించారు.

 విమెన్స్‌‌ డబుల్స్‌‌లో అశ్విన్‌‌ భట్‌‌–శిఖా గౌతమ్‌‌ 14–21, 21–11, 14–21తో డెబోరా జిల్లీ–చార్లీ సినెన్‌‌ (నెదర్లాండ్స్‌‌) చేతిలో, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో వెంకట్‌‌ ప్రసాద్‌‌–జూహీ దేవాంగన్‌‌ 12–21, 11–21తో  జన్‌‌సెన్‌‌–ఎఫ్లెర్‌‌ (జర్మనీ) చేతిలో ఓడారు.