
గువాహటి: ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లో తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్సీడ్ తన్వీ 13–15, 15–9, 15–10తో సాకి ముట్సుమోటో (జపాన్)పై గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టింది. దాంతో ఈ టోర్నీలో 17 ఏండ్ల తర్వాత పతకం గెలిచిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించింది. 2008లో గోల్డ్ మెడల్ నెగ్గిన సైనా నెహ్వాల్ 2006లో సిల్వర్ సాధించింది. అంతకుముందు అపర్ణా పోపట్ (1996) కూడా సిల్వర్ను సొంతం చేసుకుంది. ఇక 47 నిమిషాల మ్యాచ్లో తన్వీ తొలి గేమ్ను చేజార్చుకుంది. 10–6 లీడ్లో ఉన్నా.. బేస్లైన్ను తప్పుగా అంచనా వేసి వరుసగా అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
ఫలితంగా ముట్సుమోటో 11–10 ఆధిక్యంలో నిలిచి వెనుదిరిగి చూసుకోలేదు. 5–5తో రెండో గేమ్ మొదలుపెట్టిన తన్వీ దూకుడుగా ఆడుతూ మంచి ప్లేస్మెంట్స్తో వరుసగా పాయింట్లు సాధించింది. ఇక డిసైడర్లో ముట్సుమోటో 7–3 లీడ్లో నిలిచింది. కానీ వెంటనే తేరుకున్న తన్ని క్రాస్ కోర్టు స్మాష్లతో 11–9 ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఇక్కడి నుంచి మరింత చాకచక్యంగా ఆడి పాయింట్లు సాధించింది. మరో క్వార్టర్స్ మ్యాచ్లో ఉన్నతి హుడా 12–15, 13–15తో రెండోసీడ్ అన్యాపత్ ఫిచిట్ఫోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఉన్నతి కీలక టైమ్లో నెట్ ఎర్రర్స్ చేసి మ్యాచ్ను చేజార్చుకుంది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో తెలంగాణ ప్లేయర్ జ్ఞానదత్తు 11–15, 13–15తో లియు యాంగ్ మింగ్ యు (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్లో భార్గవ్ రామ్ అరిగెల–విశ్వ తేజ్ గొబ్బూరు 12–15, 10–15తో చెన్ జున్ టింగ్–లియు జున్ రొంగ్ (చైనా) చేతిలో, మిక్స్డ్ డబుల్స్లో భవ్య–విశాఖ టొప్పో 9–15, 7–15తో హుంగ్ బింగ్ ఫు–చోయు యున్ అన్ (చైనీస్తైపీ) చేతిలో ఓడారు.