ఒకప్పుడు దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా వెలిగిపోయిన బైజూస్ సామ్రాజ్యం ఇప్పుడు రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు తాజాగా సింగపూర్ కోర్టు ఏకంగా 6 నెలల జైలు శిక్ష విధించడం ఇంటర్నేషనల్ బిజినెస్ వరల్డ్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గానూకంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఈ శిక్ష పడింది.
వెంటనే అధికారుల ముందు లొంగిపోవాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం 90వేల సింగపూర్ డాలర్లు అంటే సుమారు రూ.63 లక్షలు చెల్లించాలని సింగపూర్ కోర్టు రవీంద్రన్ను ఆదేశించింది. అంతేకాదు.. ఆయనకు చెందిన బీఆర్ ఇన్వెస్ట్కో అనే కార్పొరేట్ సంస్థకు సంబంధించిన యాజమాన్య పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ లీగల్ యాక్షన్ను బైజూస్లో పెట్టుబడులు పెట్టిన ‘ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ’ సబ్సిడరీ సంస్థ ఖతార్ హోల్డింగ్స్ ప్రారంభించింది. బైజూస్ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉండి, ఉద్యోగులను తొలగిస్తూ రీస్ట్రక్చరింగ్ చేస్తున్న సమయంలో వీరు భారీగా పెట్టుబడులు పెట్టారు. లా ఫర్మ్ డ్రూ & నేపియర్ ఖతార్ హోల్డింగ్స్ తరపున వాదించగా.. బైజూస్ ఇన్వెస్ట్మెంట్స్ తరపున ఫర్వెంట్ ఛాంబర్స్ కోర్టుకు హాజరయ్యాయి.
మరోవైపు అమెరికాలో కూడా బైజూస్కు సంబంధించిన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దాదాపు 1.2 బిలియన్ డాలర్ల లోన్ను రికవరీ చేసుకునేందుకు అక్కడి క్రెడిటార్లు ప్రయత్నిస్తున్నారు. అమెరికా, సింగపూర్ వంటి పలు దేశాల్లో ఒకేసారి చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ బైజూ రవీంద్రన్ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. డిసెంబర్ 2025లో డెలావేర్ కోర్టు బైజూస్ రవీంద్రన్కు వ్యతిరేకంగా ఇచ్చిన బిలియన్ డాలర్ల తీర్పును రివర్స్ చేస్తూ ఊరటనిచ్చింది. నష్టపరిహారాన్ని సరిగ్గా లెక్కించలేదని, దీనిపై సరికొత్త విచారణ జరపాలని కోర్టు పేర్కొంది.
ALSO READ : HDFC బ్యాంకులో వడ్డీ స్కామ్..
తమ ఎడ్యుటెక్ వ్యాపారం కూలిపోవడానికి మరియు కంపెనీ వాల్యూ పడిపోవడానికి లెండర్లు, గ్లాస్ ట్రస్ట్ కీలక సమాచారాన్ని దాచడమే కారణమని బైజూస్ లీగల్ టీమ్ ఆరోపించింది. అయితే అమెరికా కోర్టులో ఈ చిన్న ఊరట లభించిన కొన్ని నెలలకే.. ఇప్పుడు సింగపూర్ కోర్టు జైలు శిక్ష రూపంలో రవీంద్రన్కు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. టెక్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన బైజూస్ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడినట్లయింది.
