ఫ్లైఓవర్ పై నుంచి పడి టెకీ మృతి ..అంబర్ పేట్ ఛే నంబర్ దగ్గర ఘటన

ఫ్లైఓవర్ పై నుంచి పడి టెకీ మృతి ..అంబర్ పేట్ ఛే నంబర్ దగ్గర ఘటన
  • హెల్మెట్​ పెట్టుకున్నా.. క్లిప్​ పెట్టుకోకపోవడంతో తలకు తీవ్ర గాయం

బషీర్​బాగ్, వెలుగు:   ​బైక్​ ఫ్లై ఓవర్​పైనుంచి పడిన ఘటనలో సాఫ్ట్​వేర్​ఉద్యోగి మృతిచెందాడు. కాచిగూడ సీఐ జ్యోత్స, ఎస్ఐ భరత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడకు చెందిన అశోక్ గుప్త  కుమారుడు శిరీష్(33) పుణెలో సాఫ్ట్​వేర్​ జాబ్  చేస్తున్నాడు. 

ఆదివారం అర్ధరాత్రి తన ఎలక్ట్రికల్ బైక్ పై గోల్నాక నుంచి రామంతాపూర్ లో ఉండే ఫ్రెండ్  వద్దకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో అంబర్ పేట్ బ్రిడ్జిపై బైక్  అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో శిరీష్​ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్​మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

హెల్మెట్ సేఫ్టీ క్లిప్​ పెట్టుకోకపోవడం వల్లే...

శిరీష్ ​హెల్మెట్​కు సేఫ్టీ క్లిప్ ​పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్​బైక్ ​ఫ్లై ఓవర్​పై నుంచి కిందపడే సమయంలో అతని తలకు ఉన్న హెల్మెట్​ఊడిపోయిందన్నారు. శిరీష్​తల బలంగా రోడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడని పేర్కొన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు హెల్మెట్​తలకు తగిలించుకుంటే సరిపోదని తప్పకుండా సేఫ్టీ క్లిప్ ​పెట్టుకోవాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలతో బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు.