గచ్చిబౌలి, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించవద్దని, ఆర్గనైజర్లు డ్రగ్స్కు అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ హెచ్చరించారు. సోమవారం గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్లో ఐటీ కారిడార్ పరిధిలోని ఈవెంట్ ఆర్గనైజర్లు, పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవెంట్లలో అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని, కెపాసిటీకి మించి ప్రజలను అనుమతించవద్దని, డీజే పాటలతో సౌండ్ పొల్యూషన్ చేయవద్దని సూచించారు. ఈవెంట్ల కోసం డిసెంబర్ 21 నుంచి సైబరాబాద్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆర్గనైజర్లు, ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో రంగారెడ్డి డీఎఫ్వో, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.
