కాగ జ్ నగర్, వెలుగు: మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఓ అభ్యర్థి ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పల్లి గ్రామంలో జరిగింది. ఇక్కడ నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఒకరైన బొమ్మెల్ల రాజన్న పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే పురుగుల మందు తాగడం గ్రామంలో కలకలం రేపింది. పోలింగ్ సమయంలో ఇంటి దగ్గర దిగులుతో ఉన్న రాజన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానో.. లేదోనన్న భయంతో రాజన్న ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆయన కొడుకు ప్రవీణ్ తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాజన్నను బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
