న్యూఢిల్లీ : అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు పెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం జరిగింది. అలాగే విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ప్రకటించనున్నారు. గతేడాది డిసెంబర్ 30న మోదీ ఈ ఎయిర్పోర్టును ప్రారంభించారు.
‘‘అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అయోధ్యధామ్’ పేరు పెట్టడం ఆ మహర్షికి నివాళి. ఆ మహనీయుని పేరుతో దానికి సాంస్కృతిక గుర్తింపు దక్కింది. అలాగే ఈ నగరం చారిత్రక ప్రాముఖ్యతకు అనుగుణంగా ఉంటుంది” అని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్తో అయోధ్య ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.