ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలింపు

ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలింపు

హైదరాబాద్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 3 కోట్ల విలువైన1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఏపీలోని సీలేరు నుంచి హైద‌రాబాద్ మీదుగా మ‌హారాష్ట్రకు గంజాయిని త‌ర‌లిస్తున్న సంజ‌య్ బాల‌కి(30), అభిమ‌న్ క‌ల్యాణ్ ప‌వార్‌(40), సంజ‌య్ చౌగులే(45), భ‌ర‌త్ కొల‌ప్ప(37), షేక్ ర‌హీదుల్(27)ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో షేక్ ర‌హీదుల్‌ వెస్ట్ బెంగాల్ కు చెందిన వ్యక్తి కాగా మిగతా నలుగురు మ‌హారాష్ట్రకు చెందినవారు. మరో నిందితుడు సంజ‌య్ ల‌క్ష్మణ్ షిండే(26) ప‌రారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షేక్ ర‌హీదుల్ గంజాయి స్మగ్లింగ్ వెహికల్​కు డ్రైవ‌ర్‌గా చేస్తున్నాడు. సంజ‌య్ ల‌క్ష్మణ్ షిండే గంజాయి ర‌వాణాను మానిట‌ర్ చేస్తూ.. పోలీసుల‌కు దొరక్కుండా ప్లాన్ చేస్తుంటాడు. సీలేరులో కిలో గంజాయిని రూ. 2 వేల‌కు కొని మ‌హారాష్ట్రలో రూ. 8 వేల‌కు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. 

కొత్తగూడెంలో 238 కిలోలు స్వాధీనం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చత్తీస్​గఢ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 238 కిలోల గంజాయిని భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం మధ్యాహ్నం పోలీసులు వెహికిల్స్
 చెకింగ్ చేపట్టారు. అదే టైంలో అటుగా వచ్చిన రెండు కార్లను ఆపి చెక్​చేయగా ఒకదానిలో 2 బస్తాలు, మరో దానిలో10 బస్తాలు కలిపి మొత్తం 238.4కిలోల గంజాయి దొరికింది. కార్లలోని గోపాల్​శర్మ, జయదీప్​యాదవ్, మాలవీయ రాజేశ్, మనీశ్​శర్మ, అభిషేక్​రాథోడ్ అనే ఐదుగురిని అరెస్ట్​ చేశారు. చుంచుపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో రూ. 47లక్షల విలువైన గంజాయిని పోలీస్​లు పట్టుకున్నట్టు కొత్తగూడెం డీఎస్పీ జి. వెంకటేశ్వర బాబు పేర్కొన్నారు.