హైదరాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లింగ్కు మహారాష్ట్ర గంజాయి మాఫియా కొత్త ఎత్తులు వేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి మహారాష్ట్ర, బెంగళూరుకు స్మగ్లింగ్ చేస్తోంది. పోలీసుల పెట్రోలింగ్ ఎక్కువగా ఉండని టైంలో ట్రాన్స్పోర్టేషన్కు ప్లాన్ చేస్తోంది. అర్ధరాత్రి దాటాక 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఒడిశా, ఏపీ, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్స్.. ప్రైవేట్ లారీలు, కార్లతో కమీషన్లను మాట్లాడుకుని హైదరాబాద్, జహీరాబాద్లలోని ఏజెంట్లకు గంజాయిని అందిస్తోంది. గంజాయి స్మగ్లింగ్ చేసే వెహికల్ ముందు పైలెట్ వెహికల్స్నూ నడుపుతోంది. పోలీసులున్నారని తెలిస్తే వెంటనే.. గంజాయి వెహికల్స్కు వీరు మెసేజ్ పంపిస్తారు.
మామూలు ఫోన్ల వాడకం
వైజాగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే గంజాయిని పోలీసుల కళ్లుగప్పి తరలించేలా ప్లాన్ చేశారు. విజయవాడ, హైదరాబాద్ హైవేలో రాత్రిపూటే ప్రయాణిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పండ్లు, కూరగాయలు, ఎరువుల బస్తాల మధ్య గంజాయిని పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఓఆర్ఆర్కు చేరుకుని.. అక్కడి నుంచి ఘట్కేసర్, శంషాబాద్ల మీదుగా మహారాష్ట్ర, నాగ్పూర్, బెంగళూరు, జహీరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి లోడ్ను బట్టి వెహికల్కు ముందు ఐదుగురు పైలెటింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు కనిపిస్తే లారీ లేదా కారు డ్రైవర్ను అలర్ట్ చేస్తున్నారు. వెహికల్ను ఆపేసి రిపేర్ చేసినట్టుగా నటిస్తున్నారు.
స్మార్ట్ఫోన్లు వాడితే దొరికిపోతారన్న ఉద్దేశంతో మామూలు ఫోన్లతోనే కాంటాక్ట్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. టోల్గేట్ల వద్ద డ్రైవర్లు మారుతున్నారు. ప్రధాన నిందితులతో కాకుండా కేవలం ట్రాన్స్పోర్ట్ చేసే వారితోనే ఫోన్లు మాట్లాడుతున్నారు. హైదరాబాద్లోని మంగళ్హాట్, ధూల్పేట్, నాంపల్లి ఏరియాల్లోని రిటైల్ వ్యాపారులకు సప్లై చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ట్రిప్కు రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా వసూలు చేస్తున్నారు.
ఎరువుల్లో పెట్టి తీసుకెళ్లిన్రు
రాచకొండ పోలీసులు ఈ నెల 25న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వైజాగ్ సీలేరు నుంచి మహారాష్ట్ర ఉస్మానాబాద్కు తరలిస్తున్న 1,820 కిలో గంజాయి, లారీ, పైలెటింగ్ కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. స్మగ్లింగ్పై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. పెద్దఅంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. గత ఆగస్టులో పూల కుండీల మధ్య పెట్టి తరలిస్తున్న రూ.21 కోట్ల విలువైన 3,400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర గ్యాంగ్ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
గట్టి నిఘా పెట్టినం
గంజాయి స్మగ్లర్లపై గట్టి నిఘా పెట్టాం. ఇప్పటికే రాచకొండ పరిధిలో 3 వేల కిలోలకుపైగా గంజాయిని పట్టుకున్నాం. ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో స్మగ్లర్ల నెట్వర్క్ను తెలుసుకుంటు న్నాం. ఓఆర్ఆర్ ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్పై నిఘా పెట్టేందుకు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. పాత నేరస్తులు ఇచ్చే సమాచారం ఆధారంగా ముఖ్యమైన నిందితులను పట్టుకుంటున్నాం. – మహేశ్ భగవత్, సీపీ, రాచకొండ