వెలుగు బిజినెస్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బ నుంచి మన దేశంలోని ఎయిర్లైన్స్ కంపెనీలు ఇంకా కోలుకోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలపాటు విమానాలన్నీ నేలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా విమానాలను అనుమతించినా డిమాండ్ పుంజుకోలేదు. కొవిడ్19 కారణంగా కెపాసిటీపై ఆంక్షలను కూడా ప్రభుత్వం విధించింది. కెపాసిటీ కొంత పుంజుకుంటున్న టైములో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ రేట్లు పెరగడం మొదలైంది. మరోవైపు రూపాయి కూడా బలహీనపడటంతో ఎయిర్లైన్స్ కంపెనీల లాభాలపై ఎఫెక్ట్ పడుతోంది. కరోనా నాటి నుంచి కెపాసిటీ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి ఈ ఎయిర్లైన్స్ కంపెనీలు.
కొవిడ్19 ఆంక్షలు...
మే 2020– అక్టోబర్ 2021 మధ్యలో ఎయిర్లైన్స్ కెపాసిటీ మీద 33 శాతం నుంచి 85 శాతం దాకా ఆంక్షలను విధించింది ప్రభుత్వం. దీంతో తమ కెపాసిటీని పూర్తి స్థాయిలో ఎయిర్లైన్స్ కంపెనీలు ఉపయోగించుకోలేకపోయాయి. రెవెన్యూ పెంచుకునే దారిలేకుండా పోవడంతో, లాభాలపైనా ఆ ఎఫెక్ట్ పడింది. 58 శాతం మార్కెట్ వాటాతో దేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్గా నిలుస్తున్న ఇండిగో గత 10 క్వార్టర్లలో 9 క్వార్టర్లు నష్టాలను ప్రకటించింది.
దీనిని బట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. కిందటేడాది అక్టోబర్ నుంచి కెపాసిటీ ఆంక్షలు ఎత్తివేసినా, డిమాండ్ పుంజుకోకపోవడంతో కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికీ విమాన ప్రయాణాలకు డిమాండ్ ఇంకా పూర్తి స్థాయిలో పెరగలేదనే చెప్పొచ్చు. కొవిడ్ 19 పలుసార్లు దేశంలోని వివిధ ప్రాంతాలను ఎఫెక్ట్ చేయడం వల్లే డిమాండ్ తొలి దశలో పుంజుకోలేదు. అంతేకాదు, విమాన ఛార్జీలు కూడా ఎక్కువగా ఉండటం మరో కారణమైంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ రేట్లు పెరగడంతో రూట్ల ఎంపికలోను, కెపాసిటీ వినియోగంలోనూ ఎయిర్లైన్స్ కంపెనీలు ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది.
కిందేడాది నుంచి జెట్ ఫ్యూయెల్ రేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ రేట్ల పెరుగుదల మరింత జోరయిందని ఇక్రా లిమిటెడ్ ఏవియేషన్ సెక్టార్ హెడ్ సుప్రియో బెనర్జీ చెప్పారు. డిమాండ్ నిలకడగా లేకపోవడంతో దేశంలోని ఎయిర్లైన్స్ కంపెనీలు అధిక కెపాసిటీ సమస్య ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు నెలలో ఇండిగో ఎయిర్లైన్స్ 43,171 సర్వీసులను నడిపింది. అంటే వారానికి 9,748. సమ్మర్ షెడ్యూల్ కింద ఈ కంపెనీ వారానికి 11,130 సర్వీసులను నడిపేందుకు అనుమతి ఉంది. ఈ అంకెలను బట్టి చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ 88 శాతం మత్రమే ఆపరేట్ చేయగలిగింది.
ఎయిర్ ఏషియా కూడా ఆగస్టు నెలలో వారానికి 1,010 విమాన సర్వీసులను మాత్రమే నడిపింది. స్పైస్జెట్ తనకు అనుమతి ఉన్న షెడ్యూల్లో 37 శాతం సర్వీసులను మాత్రమే నడపగలిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ రికవరీ బలంగానే కనిపిస్తోంది నిపుణులు చెబుతున్నారు. ఇక్రా అంచనాల ప్రకారం ప్యాసింజర్ ట్రాఫిక్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి మాత్రమే కొవిడ్కు ముందు లెవెల్స్కు చేరనుంది. కాకపోతే, పండగల సీజన్లో ఎయిర్ ట్రావెల్ డిమాండ్ జోరందుకుంటుందని కొంత మంది నిపుణులు భావిస్తున్నారు.
స్పైస్ జెట్ షేర్లు జూమ్...
ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీము (ఈసీఎల్జీఎస్) కింద రూ. 1,000 కోట్లు రానుందనే వార్తల నేపథ్యంలో గురువారం సెషన్లో స్పైస్జెట్ షేర్లు 9 శాతం ఎగిశాయి. ఇంట్రా డేలో ఒక దశలో ఈ షేరు 10.14 శాతం పెరిగి రూ. 42.35 ని తాకింది. చివరి 8.84 శాతం లాభంతో రూ. 41.85 వద్ద ముగిసింది. ఈసీఎల్జీఎస్ కింద ప్రభుత్వం మరో రూ. 1,000 కోట్లను స్పైస్ జెట్కు ఇవ్వనున్నట్లు ఏవియేషన్ రంగ నిపుణులు ఒకరు చెప్పారు. కష్టాలలో ఉన్న స్పైస్ జెట్కు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గురువారం నాడు బీఎస్ఈలో స్పైస్ జెట్ షేర్ల వాల్యూమ్ కూడా 11.28 లక్షలకు పెరిగింది. ఏవియేషన్ రంగం రికవరీకి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మెచ్చుకోదగ్గదని స్పైస్ జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్ చెప్పారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్ క్వార్టర్ లో కంపెనీకి రూ. 789 కోట్ల నష్టం వచ్చింది.