రాష్ట్రంలో 23 ప్రభుత్వ దవాఖానాల్లో కార్డియాలజీ సెంటర్లు
ఇప్పటికే అన్ని పనులు పూర్తి… ఫిబ్రవరిలో స్టార్ట్ చేసే అవకాశం
ఎన్హెచ్ఎం కింద 60 శాతం ఫండ్స్ ఇచ్చిన కేంద్రం
ఎమర్జెన్సీ కేసుల్లో గుండె పోటుదే రెండో స్థానం
టైమ్కు హాస్పిటల్ చేరక చనిపోతున్న బాధితులు
టైమ్కు దవాఖానకు చేరక ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోతున్న గుండెపోటు బాధితులకు ఇకపై ఆ ఆపద తీరనుంది. గుండెపోటు వచ్చిన వారు 20 నుంచి 40 నిమిషాల్లోపు కార్డియాలజీ సెంటర్లకు చేరేలా రాష్ట్రంలో 23 ప్రభుత్వ దవాఖాన్లలో సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లు చేసిన ఈ ప్రతిపాదనకు వెంటనే ఓకే చెప్పిన కేంద్రం సెంటర్ల ఏర్పాటుకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) కింద 60 శాతం ఫండ్స్ కేటాయించింది. వీటి ఏర్పాటుకు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ ముగియగానే ఫిబ్రవరిలో వీటిని స్టార్ట్ చేసేందుకు హెల్త్ ఆఫీసర్లు అంతా రెడీ చేస్తున్నారు.
ఎమర్జెన్సీ కేసుల్లో రోడ్డు ప్రమాదాల తర్వాత, గుండె సంబంధిత కేసులే అధికంగా ఉంటున్నాయి. 2019లో 8,850 మంది గుండె పోటు బాధితులను 108(అంబులెన్స్లు) దవాఖాన్లకు చేర్చింది. కాస్త ఆలస్యమైతే ఇందులో 2216 మంది ప్రాణాలు పోయేవని, చివరి క్షణంలో దవాఖాన్లకు చేర్చి లైఫ్ సేవ్ చేసినట్టు 108 వార్షిక రిపోర్ట్ చెబుతోంది. అయితే, చాలా మంది టైమ్కు దవాఖాన్లకు చేరక గుండె పోటుతో ప్రోణాలు కోల్పోతున్నారు. గోల్డెన్ అవర్లోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 23 సర్కారు దవాఖాన్లలో కార్డియాలజీ సెంటర్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్ ముగియగానే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 20 నుంచి 40 నిమిషాల లోపు ఈ కార్డియాలజీ సెంటర్లకు చేరుకునేలా ఈ 23 దవాఖాన్లను ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. బాధితుడు రాగానే థ్రాంబోలైసిస్ థెరపీ, ప్రాణాపాయం నుంచి తప్పించేలా ఈ సెంటర్లలో డాక్టర్, నర్సు, టెక్నీషియన్ సహా ఐదుగురు సభ్యుల టీమ్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ మినహా ఎక్కడా ప్రభుత్వ దవాఖాన్లలో కార్డియాలజీ సేవలు అందుబాటులో లేవు.
హైదరాబాద్, రంగారెడ్డి టాప్
108 రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గుండెపోటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం 8,850 హార్ట్ ఎటాక్ కేసుల్లో 23 శాతం ఈ రెండు జిల్లాల్లోనే నమోదవడం గమనార్హం. కిందటేదాది 43,817 మంది రోడ్డు ప్రమాద బాధితులను దవాఖాన్లకు చేర్చగా, ఇందులోనూ 23శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వారే ఉన్నారు. మొత్తం 6325 మంది జంతు దాడి (యానిమల్ అటాక్) బాధితులను దవాఖాన్లకు చేర్చగా, ఇందులో అత్యధికంగా నల్గొండ నుంచి ఎనిమిది శాతం, సూర్యాపేట నుంచి ఏడు శాతం కేసులు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కుక్క కాటు కేసులు అధికంగా ఉండడం గమనార్హం.