ఓ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. 35 ఏళ్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న ఎన్ఆర్ఐ.. జి.జయమాల(72) 1983 లో షేక్ పేట మండలం సర్వే నంబర్403లో 939 గజాల స్థలాన్ని పి.సుదర్శన్రెడ్డి అనే వ్యక్తితో కలిసి షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి కొన్నారు.
కొన్నాళ్లకు స్థలాన్ని రెండు భాగాలు చేసుకోగా జయమాలకు 469 గజాల స్థలం వచ్చింది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవిలో సుమారు రూ.2 కోట్ల 13 లక్షల స్థలాన్ని అమ్మారని.. దానికి సంబంధించిన ట్యాక్స్ కూడా చెల్లించలేదని అధికారులు పేర్కొంటూ.. 10 ఏళ్లుగా ట్యాక్స్ చెల్లించకపోవడంతో రూ.1.44 కోట్ల ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులు అమెరికాలో ఉన్న భూ యజమానికి వెళ్లాయి.
తిరిగొచ్చి చూస్తే షాక్..
నోటీసులు అందుకున్న జయమాల అమెరికా నుంచి హైదరాబాద్కి తిరిగొచ్చి చూసే సరికి షాక్కి గురైంది. ఆమె కొన్న స్థలంలో ఎంపీ కేశవరావు కుటుంబం నివసిస్తున్నట్లు తేలింది. 2013లోనే కేశరరావు కుమారుడు విప్లవ్కుమార్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ను అంటూ తన సోదరుడు వెంకటేశ్వరరావుకు కేవలం రూ.3 లక్షలకు అమ్మినట్లు తేలింది. సంబంధిత పత్రాలను జయమాల చూడగా అవి ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది.
ఈ వ్యవహారంపై ఆమె గతంలోనే బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కంప్లేంట్ చేశారు. తాజాగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.