- ఎంపీటీసీ ఎలక్షన్లో సపోర్ట్ చేస్తామని భరోసా
- ఎక్కడ చూసినా రాజీ చర్చలే
- అధిక నామినేషన్లు పడిన జీపీల్లో అయోమయం
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని బోధన్ డివిజన్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమే లక్ష్యంగా నామినేషన్లు వేసిన వారిని ఆశావహులు బుజ్జగించడంతోపాటు బేరసారాలు ఆడుతున్నారు. సోమవారం స్క్రూట్నీ ముగియడంతో మిగిలిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోటీలో నిలిచినవారిని విత్డ్రా చేయించేందుకు పైరవీలు షురూ చేశారు. నాలుగైదు నామినేషన్లు పడిన జీపీల్లో విత్డ్రాకు రూ.లక్షల్లో నజరానా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
కుల సంఘాల పెద్దలను ఒప్పించి వారితో రాజీ కుదిర్చేందుకు మీటింగ్లు పెడుతున్నారు. ఏకగ్రీవానికి ఫస్ట్ ప్రాధాన్యతనిస్తున్నారు. కుదరకపోతే ముఖాముఖి పోటీలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు పడిన పంచాయతీల్లో రాజీ కుదర్చడం ప్రధాన పార్టీల లీడర్లకు తలనొప్పిగా మారింది.
ఎంపీటీసీ బరిలో నిలుపుతాం..
ఏకగ్రీవం కోసం నామినేషన్ వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తున్నారు. సర్పంచ్పోటీ నుంచి తప్పుకుంటే ఎంపీటీసీ ఎన్నికల్లో సపోర్టు చేస్తామని బేరసారాలు ఆడుతున్నారు. బోధన్ డివిజన్లో 184 గ్రామ పంచాయతీలు, 1,642 వార్డులకు ఫస్ట్ విడతలో ఈనెల 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 27 నుంచి 29 వరకు విధించిన గడువులో సర్పంచ్ స్థానాలకు 1,156, వార్డులకు 3,526 నామినేషన్లు దాఖలయ్యాయి. 3వ తేదీ విత్డ్రా గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు. బోధన్ మండలంలోని జనరల్పంచాయతీలో సర్పంచ్ పోస్టుకు ఐదుగురు నామినేషన్లు వేశారు. నలుగురు విత్డ్రా అయితే ఒక్కొక్కరికి రూ.5 లక్షల తోపాటు గ్రామాభివృద్ధికి రూ.31 లక్షల ఇస్తామంటూ ఒకరు ఆఫర్ ఇచ్చారు.
ఒప్పందం కుదుర్చుకునేందుకు కుల పెద్దలతో సోమవారం మీటింగ్ నిర్వహించారు. బీసీ జనరల్కు రిజర్వు చేసిన మరో పంచాయతీలో ఇద్దరిని విత్డ్రా చేయించడానికి గ్రామ ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రెంజల్ మండలంలో ఐదుగురిలో ముగ్గురిని విత్డ్రా చేయించడానికి మిగిలిన ఇద్దరు బేరాలు నడుపుతున్నారు. ఎంపీటీసీ ఎలక్షన్లో సపోర్టు చేస్తానని ఒకరు ఆఫర్ ఇవ్వగా, మరొకరు క్యాష్ ఇస్తామని ప్రలోభపెట్టారు. ముగ్గురు నామినేషన్లు వేసిన ఒక జీపీలో ఇద్దరి మధ్య విత్డ్రా ఒప్పందానికి మండల నేతలు కసరత్తు చేస్తున్నారు.
ముగ్గురు నామినేషన్లు వేసిన ఓ గిరిజన తండాలో పంచాయతీ ఎన్నికలు ఫ్యామిలీ చిచ్చురేపాయి. తన ఏకగ్రీవానికి మద్దతుగా విత్డ్రా చేసుకోకుంటే బంధుత్వం తెగిపోయినట్లేనని బెదిరింపులకు పాల్పడ్డారు. నవీపేటలోని గిరిజన తండాలో ఇద్దరి విత్డ్రాకు రూ.4.5 లక్షలు, మరో జీపీలో రూ.9.5 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తాన్ని తండా అభివృద్ధికి ఖర్చు చేస్తామని, మంగళవారం కూర్చుని మాట్లాడుకుందామని ఒప్పందం చేసుకున్నారు.
ఏం చేసేది ?
బీసీ జనరల్ రిజర్వ్ అయిన కోటగిరి జీపీ సర్పంచ్ స్థానానికి అత్యధికంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. బీసీ జనరల్కు కేటాయించిన ఎడపల్లి మండలం జాన్కంపేటలో 13, అదే సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన నెహ్రూనగర్ పంచాయతీలో 10 మంది పోటీలో ఉన్నారు. 72 గ్రామపంచాయతీల్లో పదికి మించి నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరూ వెనక్కు తగ్గకపోవడం ప్రధాన పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది.
