క్యాజువల్గా అలవాటవుతుంది.. క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది.. పొగాకు వినియోగంపై షాకింగ్ నిజాలు..!

క్యాజువల్గా అలవాటవుతుంది.. క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది.. పొగాకు వినియోగంపై షాకింగ్ నిజాలు..!

పొగాకు అలవాటు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా.. సిగరెట్ తాగేవాళ్లు, గుట్కా, ఖైనీ తినేవాళ్లు పెరుగుతూనే ఉన్నారు. దీనంతటికీ కారణం.. అవగాహన లేకపోవడమే. అందుకే డబ్ల్యూటీవో ప్రతి సంవత్సరం మే 31న ‘పొగాకు వ్యతిరేక దినం’ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ‘ఊపిరితిత్తుల ఆరోగ్యం’ అనే థీమ్ తో కార్యక్రమాలు చేపట్టింది.

పొగాకు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నవాళ్లు కొందరైతే... సిగరెట్ తాగడాన్ని స్టేటస్ గా భావించేవాళ్లు మరికొందరు. అయితే, చాలామంది సిగరెట్ తాగేవాళ్లకు, గుట్కా నమిలేవాళ్లకు ఈ అలవాటు టీనేజీలోనే మొదలవుతుంది. ఒత్తిడి వల్లనో.. ఫ్రెండ్స్ చెప్పారనో... సరదా కోసమో.. సినిమాల్లో చూసి.. చుట్టుపక్కల వాళ్లు కాలుస్తుంటే చూసి.. కారణం ఏదైతేనేం సిగరెట్ తాగాలనే ఆలోచన వస్తుంది. అప్పుడే ఆ ఆలోచనను చంపేస్తే సరిపోతుంది. కాదని అలవాటు చేసుకుంటే.. మానడం అంత ఈజీ కాదు. 

ఈ-సిగరెట్లు, కౌన్సెలింగ్ వల్ల మారేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఇలా మాన్పించడం కష్టమని తెలిసి, టీనేజ్ లో ఉన్నప్పుడే వాళ్లను కట్టడి చేస్తున్నాయి కొన్ని దేశాలు. టీనేర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని చాలా దేశాలు రూల్స్ పెడుతున్నాయి. ఇది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ దేశాల్లో టీనేజర్లకు సిగరెట్లు, గుట్కాలు అమ్మడం నిషేదం. ఎక్కువమందికి టీనేజ్ లో ఉన్నప్పుడే పొగాకు అలవాటు అవుతోందని ఇలాంటి రూల్స్ పెట్టి కఠినంగా అమలు చేస్తున్నాయి ఆ దేశాలు. అయితే, మన దేశంలో కూడా ఏజ్ లిమిట్ (18 సంవత్సరాలు దాటితేనే.) ఉన్నా సరిగా అమలు కావడంలేదు.

యంగేజ్ లో సరదా కోసం చేసుకున్న అలవాటు చివరకు ప్రాణాలనే తీస్తోంది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ప్రాణం పోతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో దాదాపు ఏటా ఐదున్నర కోట్ల మంది చనిపోతున్నారు. అందులో సుమారు 80 లక్షల మంది పొగాకు వల్ల చనిపోతున్నారు. అందులోనూ దాదాపు పది లక్షల మంది ప్రాణాలు సెకండ్ స్మోకింగ్..( అంటే సిగరెట్ తాగే వాళ్లు వదిలిన పొగ పీల్చడం) వల్ల పోతున్నాయి. పొగాకు తీసుకునేవాళ్లు కేవలం సిగరెట్లతో పాటు గుట్కా, ఖైనీ, పాన్ మసాలా రూపంలో కూడా ఏ విధంగా తీసుకున్నా పొగాకు ప్రమాదమే. ఎక్కువ మంది మాత్రం పొగ రూపంలో తీసుకుంటారు, అంటే బీడీ, చుట్ట, సిగరెట్, హుక్కా కాల్చి పొగను పీలుస్తారు. 

అయితే ఫిల్టర్ చేసిన సిగరెట్ల వల్ల సమస్యలు రావు అనుకుంటారు. కానీ.. బీడీ చుట్టల్లో ఉండే రసాయనాలే వాటిలో కూడా ఉంటాయి. పొగాకులోని నికోటిన్ తోపాటు టార్ (బూడిద), హైడ్రోజన్ సైనైడ్, పార్మాల్డిహైడ్, టెడ్, ఆర్సెనిక్, అమ్మోనియా, బెంజీన్ లాంటి హానికర రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి కణాలను కణుతులుగా మారుస్తాయి. 

నమిలి తీసుకునే పొగాకు వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. గుట్కా, పాన్, ఖైనీల రూపంలో ఎక్కువ మంది పొగాకును నములుతున్నారు. ఇలా నమిలినప్పుడు పొగాకులో ఉండే నికోటిన్ వల్ల మెదడులో ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం విడుదలై మెదడు చురుకుగా పని చేస్తుంది. దాంతో హుషారుగా పనిచేస్తారు. కానీ పొగాకు నమిలినప్పుడు నికోటిన్తో పాటు మరికొన్ని రసాయనాలు కూడా శరీరంలోకి వెళ్తాయి. అవన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే. వీటివల్ల కణాల విభజనలో మార్పులు వచ్చి కణుతులు ఏర్పడుతాయి. పొగాకు నమిలేవాళ్లకు ఎక్కువగా నోరు, పేగు, గొంతు క్యాన్సర్లే వస్తాయి.

ఎవరి మాట వినరు

చాలామందికి పొగాకు ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తీసుకుంటుంటారు. ఎందుకంటే ఈ వ్యసనం నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఒక్కసారి అలవాటు పడితే ఇక అంతే.  కొందరైతే దానికోసం ఎంతకైనా తెగిస్తారు. అదెంతలా ఉంటుందంటే.. ఈ మధ్య ఢిల్లీకి వస్తున్న సౌదీ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ఒక యువకుడ్ని సిగరెట్ తాగొద్దన్నందుకు నానా రగడ చేశాడు. మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతనొక్కడే కాదు.. రోడ్ల మీద కూడా చాలామంది సిగరెట్లు తాగుతుంటారు. వద్దని చెప్తే కొందరు గొడవకు దిగుతారు. కారణం.. వాళ్లు పొగకు బానిసలు అవ్వడమే.

కష్టమేం కాదు

ముందుగా 'మానేస్తాను' అని దృఢంగా నిర్ణయించుకోవాలి. సిగరెట్ తాగేవాళ్లకు కొంతకాలం దూరంగా ఉండాలి. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటును తగ్గించుకోవాలి. ఇక అస్పలంటే అస్సలు తాగను అనుకుప్పుడు ‘‘మానేస్తున్నా" అని స్నేహితులకు చెప్పాలి. ఇలా చేయడం వల్ల మళ్లీ వాళ్ల ముందు తాగాలంటే నామోషీగా ఉంటుంది. కాబట్టి తాగడానికి ఇష్టపడరు. ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.

స్మోక్ ఫ్రీ హైదరాబాద్

హైదరాబాద్ లో రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లపై నడుస్తుంటే.. సిగరెట్ తాగి, జనాలు ఉన్నారని కూడా చూడకుండా పొగ వదిలేవాళ్లు చాలామందే కనిపిస్తుంటారు. ఆ పొగ వల్ల ఇతరులు ఇబ్బంది పడతారని కూడా ఆలోచించరు. అలాంటివాళ్ల ఆటలు ఇక నుంచి సాగవు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 200 రూపాయల ఫైన్ వేసి, కౌన్సెలింగ్ ఇస్తారు పోలీసులు. ఈ నిబంధన ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు స్ట్రిక్ట్ గా అమలు చేయనున్నారు. 

ఇకనుంచి పొగతాగుతూ ఎవరు కనిపించినా 100కు సమాచారం ఇస్తే చాలు పోలీసులు వెంటనే వస్తారు. జరిమానా వేసి, కౌన్సెలింగ్ ఇస్తారు. "స్యోక్ ఫ్రీ హైదరాబాద్' లక్ష్యంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నో టొబాకో డే’ సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతి  (అక్టోబర్ 2) నాటికి నగరాన్ని స్మోక్ ఫ్రీ హైదరాబాద్ గా మార్చాలని లక్ష్యంగా నిర్ణయిచుకున్నారు.