
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ సంచాలన భవన్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఏఆర్ రాజశేఖర్పై సీబీఐ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. రాజశేఖర్తో పాటు ఆయన భార్య నవనీత, మరికొందరు ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా చేర్చారు.
2017 నుంచి 2023 మధ్య రాజశేఖర్ దంపతులు పలు స్థిర, చరాస్తులను కూడబెట్టినట్టు సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించారు. మొత్తం రూ. 1.54 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. దాంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్యాక్ట్ సెక్షన్ 13(2), 13(1) కింద కేసు నమోదు చేశారు. రాజశేఖర్ అక్రమార్జనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నారు.