ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే. వాస్తవానికి మే 19న అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌ కూడా చేరుకున్నారు. చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వెంటనే కారులో పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. 

తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, అవినాష్ రెడ్డి తన కాన్వాయ్‌ను వెనక్కి తిప్పారు. అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ ఎంజైమ్స్‌ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్‌ కూడా కర్నూలులోనే ఉన్నారు. అవినాష్‌ రెడ్డి దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ వాట్సాప్ ద్వారా అవినాష్‌ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు పంపించారు. సోమవారం ( మే22)ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.