న్యూఢిల్లీ:మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్ట్ ఆడ్వకేట్, మానవ హక్కుల నేత ఇందిరా జైసింగ్, ఆమె భర్త, లాయర్ ఆనంద్ గ్రోవర్ ఇళ్లు, ఆఫీసుల్లో సీబీఐ గురువారం సోదాలు జరిపింది. నిజాముద్దీన్లోని ఇందిరా ఇంట్లోనూ ఆనంద్ గ్రోవర్ నడుపుతున్న ఎన్జీవో..లాయర్స్ కలెక్టివ్ ఆఫీసుఉన్న జంగ్పురాలోనూ సోదాలు జరిగాయి. దీంతోపాటు ముంబైలో ఉన్న లాయర్స్ కలెక్టివ్ ఆఫీస్లోనూ గురువారం ఉదయం ఐదు గంటల నుంచే సోదాలు చేసినట్టు సీబీఐ అధికారులు చెప్పారు. మరోవైపు మానవ హక్కుల రంగంలో తాము పనిచేస్తున్నందు వల్లే తనను, భర్త ఆనంద్ గ్రోవర్ను సీబీఐ టార్గెట్ చేసిందని ఇందిరా జైసింగ్ ఆరోపించారు.
కేసు ఏంటి?
ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుంచి నిధుల్ని సేకరించారన్న ఆరోపణలపై ఇందిరా జైసింగ్భర్త ఆనంద్ గ్రోవర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వినియోగంలో అక్రమాలకు పాల్పడిందంటూ కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదుల ఆధారంగా లాయర్స్ కలెక్టివ్ ఆర్గనైజేషన్పై సీబీఐ కేసు పెట్టింది. విదేశాల నుంచి సేకరించిన నిధుల్ని గ్రోవర్ నడుపుతున్న ఎన్జీవో ‘‘రాజకీయ ప్రయోజనాల’’ కోసం వాడుతోందన్న ఆరోపణలు రావడంతో ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ ( ఎఫ్సీఆర్ఏ) కింద అప్పటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సంస్థ లైసెన్స్ను రద్దుచేశారు. విదేశాల నుంచి వచ్చిన డబ్బు, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నదీ వివరిస్తూ లాయర్స్ కలెక్టివ్ ప్రభుత్వానికి రిపోర్ట్ను అందజేసింది. దాన్ని పరిశీలించిన హోంమినిస్ట్రీ… ఎన్జోవీలో అవకతవకలు జరిగినట్టు గుర్తించి…దీనిపై లోతుగా విచారణ జరిపేందుకు సీబీఐని పురమాయించింది.
హోంమినిస్ట్రీ ఏమంటోంది?
విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బును ట్రస్ట్ సభ్యులు, ఆనంద్ గ్రోవర్, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ విమాన ప్రయాణాలకు, లాడ్జీలు, బోర్డింగ్లు, లోకల్ ట్రావెల్ కోసం ఖర్చుచేసినట్టు హోం మినిస్ట్రీ గుర్తించింది. మీటింగ్లు, ధర్నాలకు కూడా ఈ డబ్బునే వాడినట్టు తేల్చింది. హెచ్ఐవీ/ ఎయిడ్స్ డ్రాఫ్ట్ బిల్లుపై కన్సల్టేషన్ల కోసం ఈమీటింగ్లు జరిపినట్టు హోం మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. 2009, 2011, 2014 సంవత్సరాల్లో ర్యాలీలు, ధర్నాల కోసం లాయర్స్ కలెక్టివ్ సంస్థ 13 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలిపింది. 2006–-07, 2014–-15 మధ్య కాలంలో సుమారు 32.39 కోట్ల ఫారెన్ ఎయిడ్ తీసుకున్నట్టు చెప్పింది.
ఇందిరా జైసింగ్ తెరమీదకు ఎప్పుడొచ్చారు?
లాయర్స్ కలెక్టివ్కు చెందిన ఫారెన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అకౌంట్ను హోం మినిస్ట్రీ ఈ ఏడాది జూన్లో సస్పెండ్ చేసింది. ఎఫ్సీఆర్ఏను అతిక్రమించారని ఇందిరా జైసింగ్కు నోటీసు ఇచ్చింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా ఉన్నప్పుడే ఇందిర ఫారెన్ ఫండ్ను తీసుకున్నారని తెలిపింది. ఎఫ్సీఆర్ఏ కింద గవర్నమెంట్ సర్వెంట్ విదేశీ నిధులు తీసుకోవడం నిబంధనలకు వ్యతిరేకం. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఆమెకు జీతం ఇచ్చారు. అయినప్పటికీ లాయర్స్ కలెక్టివ్కు ఫారెన్ కంట్రిబ్యూషన్ రూపంలో వచ్చిన 96 కోట్లను ఆమె రెమ్యునరేషన్గా తీసుకున్నారని ప్రభుత్వం చెప్పింది. సీబీఐ ఆరోపణల్ని లాయర్స్ కలెక్టివ్ వర్గాలు ఖండించాయి.