ఇద్దరిపై కేసు నమోదు
రూ.10కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించిన అధికారులు
హైదరాబాద్,వెలుగు:
పాకిస్తాన్ అడ్డాగా ఐపీఎల్ మ్యాచ్లపై సిటీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్లపై సోమ, మంగళవారాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఇద్దరిపై కేసు ఫైల్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా 2010 నుంచి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నడుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ అధికారులు స్థానిక బెట్టింగ్ గ్యాంగ్ను ట్రేస్ చేశారు. మనీ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ఢిల్లీలోని సీబీఐకు సమాచారం అందించారు. ఈ నెల 13న రెండు కేసులు ఫైల్ చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా సిటీకి వచ్చి ఎల్బీనగర్లోని ఎస్బీఐ కాలనీకి చెందిన గుర్రం వాసు, సతీశ్ ఇండ్లల్లో తనిఖీలు చేశారు. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలోనూ సోదాలు..
ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన బెట్టింగ్ పంటర్ దిలీప్ కుమార్ ఇండ్లల్లోనూ అధికారులు సోదాలు చేశారు. ఎఫ్ఐఆర్లో దిలీప్తో పాటు సిటీకి చెందిన గుర్రం వాసు, సతీశ్ పేర్లను నమోదు చేశారు. నిందితుల అకౌంట్ల నుంచి ఇప్పటివరకూ రూ.10 కోట్లకు పైగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు. పాకిస్తాన్ అధికారులు అందించిన డేటా ఆధారంగా ఢిల్లీ, జోధ్ పూర్, సిటీలో పంటర్లను గుర్తించారు. వారి బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి పాకిస్తాన్కు చెందిన వాకస్ మాలిక్ పేరుతో బెట్టింగ్ జరుగుతున్నట్లు సీబీఐ అధికారులు తేల్చారు. వాకస్ మాలిక్తో గుర్రం వాసు, సతీష్ డైరెక్డ్ కాంటాక్ట్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దిలీప్ కుమార్ అకౌంట్లో 2013 నుంచి దాదాపు రూ. 43 లక్షలకు పైగా బెట్టింగ్ కు సంబంధించిన డిపాజిట్స్ ఉన్నట్లు పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.