- కంప్లయెన్స్ పెరగడంతోనే జీఎస్టీ కలెక్షన్ల జోరు
- నెలవారీ సగటు కలెక్షన్ రూ. 1.67 లక్షల కోట్లు
- సీబీఐసీ చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్
న్యూఢిల్లీ : కంప్లయెన్స్ (రూల్స్ సరిగ్గా అమలు చేయడం) పెరగడం వల్లే నెలవారీ జీఎస్టీ కలెక్షన్లు ఎక్కువవుతున్నాయని సీబీఐసీ చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ గురువారం వెల్లడించారు. రిటర్న్ల ఫైలింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లను కొంత కఠినం చేయాలనే జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో ఫేక్ ఐటీసీ (ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్) క్లెయిమ్స్ను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ఐరన్ అండ్ స్టీల్ సహా కొన్ని రంగాలలో ఫేక్ ఐటీసీ బెడద ఎక్కువగా ఉంటోందని వెల్లడించారు. ఏ ఏ రంగాలలో పన్ను ఎగవేత ఉంటోందనే అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)కి చాలా సూచనలు వచ్చాయని, వాటన్నింటినీ చర్చించామని వివరించారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లని, ఆ తర్వాత మూడు నెలల్లోనూ కలిపి చూసినా సగటు కలెక్షన్లు రూ. 1.67 లక్షల కోట్లకు పెరిగాయని అగర్వాల్ చెప్పారు. జీఎస్టీ వసూళ్లు ఎక్కువవడానికి జీడీపీ పెరుగుదల ఒక కారణమైతే, కంప్లయెన్స్ పెరగడం మరో కారణమని వివరించారు. రిస్క్ బిహేవియర్ ఎనాలిసిస్ ఆధారంగా 1 శాతం పన్ను చెల్లింపుదారులను మాత్రమే స్క్రూటినీ చేస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ సిస్టమ్లోకి మోసగాళ్లు ఎంటరవకుండా చర్యలు తీసుకుంటున్నామని, పన్నులు సక్రమంగా చెల్లించేలా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని అగర్వాల్ అన్నారు. ఫేక్ ఐటీసీ ప్రోబ్లమ్ కొంత క్లిష్టమైనదేనని, దీనిని అధిగమించేందుకు తమకు సలహాలు, సూచనలు చాలానే వచ్చాయని చెప్పారు. ఫేక్ రిజిస్ట్రేషన్లను కనుక్కోవడానికి రెండు నెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, 9 వేల బోగస్ సంస్థలు తేలాయని, అవి రూ. 11 వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టాయని చెబుతూ, ఇప్పటికే రూ. 45 కోట్లను రికవర్ చేశామని పేర్కొన్నారు.