కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‎గ్రేషియా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‎లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. కాశీబుగ్గ వెంకట్వేశ్వర ఆలయంలో తొక్కిసలాటకు ప్రధాన కారణం క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన రెయిలింగ్ విరిగిపోవడమేనని ప్రాథమికంగా తెలుస్తోంది. 2025, నవంబర్ 1న కార్తీక మాసం ఏకదాశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కాశీబుగ్గ ఆలయానికి  తరలివచ్చారు. 

►ALSO READ | నవంబర్ 1 నుంచి మారిన IRCTC రూల్స్.. ఇకపై వారు లోయర్ బెర్త్ బుక్ చేస్కోవచ్చు..

భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైన నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రెయిలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 9 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.