కరోనా టీకాను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి

కరోనా టీకాను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి

అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు‌ చేపట్టాలన్నారు మంత్రి హరీశ్ రావు. కరోనా చికిత్సకు‌ సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై  జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్దతు తెలిపారు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.. దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని కోరారు.

అవసరాల‌కు తగినంతగా దేశీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని.. దేశ అవసరాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకొనైనా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు.మూడో విడత‌ కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికతో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కరోనా చికిత్స కు అవసరమైన ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై  మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు.కమిటీ లోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

కొవిడ్ ఉదృతి‌ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సాగుతోందని.. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందన్నారు హరీశ్ రావు. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు‌కొనసాగుతుందో తెలియదన్నారు. మే నె‌లలో ‌లాక్ డౌన్ తో 4100కోట్లు  ఆదాయాన్ని కోల్పోయమని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం ఎఫ్ఆర్ బీఎం ను 4 నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. FRBM పెంపుతో దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు.