తెలంగాణకు 6 అర్బన్ ఫారెస్ట్ లు రానున్నాయి. నగర్ వన్ యోజన కింద రాష్ట్రానికి రూ. 8 కోట్ల 26 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది కేంద్రం. తొలివిడతలో భాగంగా 70 శాతం నిధులు విడుదల చేసినట్లు తెలిపింది కేంద్రం. పట్టణాల్లో పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద ఈ నిధులు మంజూరు చేసింది కేంద్రం. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో 6 కొత్త అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటుకు గాను మొదటి విడతలో 70 శాతం నిధులను మొత్తం రూ. 8.26 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
పట్టణాల పరిధిలో అర్బన్ ఫారెస్ట్ ల ఏర్పాటు ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడమే నగర్ వన్ యోజన పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు అధికారులు. నగర్ వన్ యోజన కింద ఏర్పాటయ్యే అర్బన్ ఫారెస్ట్లలో స్థానిక వృక్షజాలానికి ప్రాధాన్యం ఇస్తూ విస్తృతంగా మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.
అర్బన్ ఫారెస్ట్ ల నడక మార్గాలు, విశ్రాంతి కేంద్రాలు, పచ్చని మైదానాలతో ప్రజలకు ప్రకృతి ఒడిలో విహరించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, ఉదయ, సాయంత్రపు వాకర్లకు ఈ అర్బన్ ఫారెస్ట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అన్నారు అధికారులు.
ఆమోదం పొందిన అర్బన్ ఫారెస్ట్ల ప్రాంతాలు ఇవి:
ఆదిలాబాద్ జిల్లా:
- మావళా,
- యాపల్గూడ–II
మంచిర్యాల జిల్లా:
- ఇందారం (క్యాతనపల్లి మండలం),
- చెన్నూర్
మేడ్చల్ –మల్కాజ్గిరి జిల్లా:
- యెల్లంపేట
- చెంగిచెర్ల
ఈ అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటు వల్ల పట్టణాల్లో హరితావరణం విస్తరించడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడనుందని అన్నారు అధికారులు. అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది.నగర్ వన్ యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ పరిరక్షణలో ముందంజలో నిలిపే దిశగా ఈ అర్బన్ ఫారెస్ట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు అధికారులు.
