మంచిర్యాల: నిరుపేద ప్రజలకు ఉపాధిని కల్పించాలనే సదుద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయొద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టాలన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ మంగళవారం (జనవరి 20) భీమారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి వివేక్ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చి వీబీ రామ్ జీ అనే పేరు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తుందని ఆరోపించారు. జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని పునరుద్దరించాలని.. ఆ స్కీమ్ లేకుంటే మళ్లీ వలసలు మొదలవుతాయన్నారు.
