హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు ఎలివేటెడ్ కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్–నాగ్పూర్ హైవేపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. హైదరాబాద్లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు లైన్ క్లియర్ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఎనిమిదేండ్ల పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని, దీంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శామీర్పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ రూట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయన్నారు.