V6 News

వక్ఫ్ బోర్డు చట్టంలో 44 సవరణలు

వక్ఫ్ బోర్డు చట్టంలో 44 సవరణలు

న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌‌‌‌‌‌‌‌డీఏ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో రెండు బిల్లులను తీసుకురావడం ద్వారా చట్టానికి 40కి పైగా సవరణలను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ సవరణలలో ముఖ్యంగా బాడీ దాని ప్యానెల్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు మహిళా సభ్యులను కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేస్తోంది. 

సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తిని నమోదు చేయడం, బోహ్రా కమ్యూనిటీ హక్కుల పరిరక్షణ ప్రతిపాదిత సవరణలూ ఇందులో ఉన్నాయి. ఏదైనా ఆస్తిని 'వక్ఫ్ ఆస్తి'గా ప్రకటించే అధికారాన్ని బోర్డుకు తొలగించాలని కూడా సవరణ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ 40ని రద్దు చేస్తారు. వక్ఫ్ సవరణ బిల్లు వివరాల ప్రకారం.. వక్ఫ్ చట్టం 1923 ఉపసంహరించబడుతుంది. 1995 వక్ఫ్ చట్టం నిర్మాణం మెరుగైన పనితీరు, నిర్వహణ కోసం 44 సవరణలను ప్రవేశపెట్టడం ద్వారా మార్చబడుతుంది.