హైదరాబాద్, వెలుగు: నిరుడు వానాకాలం సీజన్ (2021- 22)కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును నవంబర్ 30 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్ కుమార్ వర్మ ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేశారు. గత యాసంగి సీజన్ లో సేకరించిన ధాన్యంలో మరో 4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతించింది. దీంతో గతంలో ఇచ్చిన 8 లక్షల టన్నుల అనుమతిలో కలిసి మొత్తం12 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైంది.
సీఎంఆర్ గడువు పెంచాలని సెప్టెంబరు 23, అక్టోబరు 22న రాష్ట్ర సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అధికారులతో కలిసి సివిల్ సప్లయ్స్ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆగస్టు 30న నిర్వహించిన మీటింగ్లో మిల్లింగ్ స్ట్రీమ్ లైన్ చేసి వేగంగా సీఎంఆర్ ఇస్తామని కేంద్రానికి నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా అనుమతి లభించింది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.