హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్ల బయో వేస్ట్ మేనేజ్ మెంట్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మెడికల్ టీమ్ లను సెంట్రల్ ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ ఆదేశించింది. వేస్ట్ ను తరలించేందుకు ప్రత్యేక బ్యాగులు, వాహనాలు వాడాలని, సిబ్బంది కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనాను కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మూడు రోజుల స్టడీలో భాగంగా శనివారం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్ )తోపాటు అన్నపూర్ణ క్యాంటీన్లను, భారీ మెస్ ను పరిశీలించింది. కేంద్ర జల శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా నేతృత్వంలోని ఈ టీమ్ లో పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, కన్జ్యూమర్ ఎఫైర్స్ శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు. టిమ్స్ లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ బృందం.. డాక్టర్లు, సిబ్బంది భద్రతపై ప్రత్యేక సూచనలు చేసింది.
గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నరా?
టిమ్స్ ఐసీయూలో ఎమర్జెన్సీగా 37 మందికి ట్రీట్ మెంట్ అందించేలా ఆధునిక పరికరాలు ఉన్నాయని, పేషెంట్ల సంఖ్యను బట్టి బెడ్ల సంఖ్యను 50కు పెంచుతామని టిమ్స్ డాక్టర్లు సెంట్రల్ టీమ్ కు వివరించారు. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ గైడ్ లైన్స్ ను అనుసరించి ప్రోటోకాల్ కమిటీల ఏర్పాటు, కరోనా నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై వివరాలను సెంట్రల్ టీమ్ అడిగి తెలుసుకుంది. టిమ్స్ ఐసీయూ, సాధారణ వార్డులను పరిశీలించింది.
అతిపెద్ద కిచెన్ సందర్శన
లాక్ డౌన్ తో హైదరాబాద్ లో చిక్కుకున్న వలస కూలీలు, పేదలకు ఉచితంగా ఆహారం అందిస్తున్న అన్నపూర్ణ క్యాంటిన్లతోపాటు కోకాపేటలోని అతిపెద్ద అక్షయపాత్ర మెస్ ను కేంద్ర బృందం విజిట్ చేసింది. భోజనాల నాణ్యత, రవాణా, డిస్ట్రిబ్యూషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర బృందం పలు సూచనలు చేసింది. కాగా, సెంట్రల్ టీం ఆదివారం డీజీపీ ఆఫీస్, సిటీలో లాక్ డౌన్ అమలు, కంటైన్ మెంట్ ఏరియాల్లో ఏర్పాట్లపై స్టడీ చేయనుంది.
లాక్ డౌన్ కు జనం సహకరిస్తున్నరా?
లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి సిటీలో సోషల్ డిస్టెన్సింగ్, రాత్రి కర్ఫ్యూలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఈ టీమ్ శనివారం బషీర్ బాగ్ ఆఫీసులో సీపీ అంజనీకుమార్ ను కలిసింది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించి.. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిపై నమోదు చేసిన కేసుల వివరాలను రికార్డ్ చేసింది.
లాక్ డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నం
కరోనా నివారణ కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించామని సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర బృందానికి తెలిపారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. కరోనా నివారణకు రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై వారికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర బృందం బీఆర్కే భవన్ లో సీఎస్ తో సమావేశమైంది. రాష్ట్రంలో అందిస్తున్న ట్రీట్ మెంట్ , కంటైన్ మెంట్ జోన్ల నిర్వహణ, హెల్ప్ లైన్లతోపాటు తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ, వలస కార్మికులకు షెల్టర్ హోమ్స్, అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఆహారం సరఫరా తదితర అంశాలను కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. రాష్ట్ర చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.