
- బ్రెంట్ క్రూడాయిల్ రేటు 120 డాలర్లకు చేరుతుందని అంచనా
- హర్ముజ్ నీటి మార్గాన్ని ఇరాన్ మూసేస్తే పెరగనున్న రవాణా ఖర్చులు
- నష్టపోనున్న ఇండియా ఎకానమీ
న్యూఢిల్లీ: ఇరాన్–-ఇజ్రాయెల్ మధ్య గొడవ కేవలం మిడిల్ ఈస్ట్ సమస్య మాత్రమే కాదని, మన జేబుకి చిల్లు పెట్టే సమస్య అని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ ఎకానమీపై దీని ప్రభావం ఉంటుందని అన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ గొడవతో ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఈ గొడవ మొదలైన వెంటనే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 11 శాతానికి పైగా పెరిగాయి.
బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్కి 75.32 డాలర్లకు చేరింది. క్రూడాయిల్ ధరలు పెరిగితే, ఆయిల్ కోసం దిగుమతులపై ఆధారపడే ఇండియా వంటి దేశాలు నష్టపోతాయి. ఆయిల్ ధరలు పెరిగితే, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువవుతుంది. ఎరువుల ధరలు పెరిగితే ఫుడ్ ధరలూ పెరుగుతాయి.
ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే?
ఇరాన్–-ఇజ్రాయెల్ గొడవ ఎక్కువ కాలం కొనసాగితే, క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కి 120 డాలర్లకు చేరొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనావేస్తున్నారు. అదే జరిగితే ఇండియాలో ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా ఫుడ్, రోజువారీ అవసరాలు ఖరీదు అవుతాయి. ఇండియా ఇరాన్ నుంచి నేరుగా ఆయిల్ కొనకపోయినా (యూఎస్ ఆంక్షల వలన), ఇరాన్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దేశంలో అనిశ్చితి నెలకొంటే, ఆ ప్రభావం ఇండియాతో సహా చాలా దేశాలపై పడుతుంది.
ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ని బ్లాక్ చేస్తే..
స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ప్రపంచంలో ఆయిల్ ట్రేడ్కి అతి ముఖ్యమైన సముద్ర మార్గం. ఈ సన్నని నీటి మార్గంలో ఎనిమిది దీవులు ఉండగా, ఇందులో ఏడు ఇరాన్ నియంత్రణలో ఉన్నాయి. ప్రతి రోజూ ప్రపంచంలో మూడింట ఒక వంతు క్రూడ్ ఆయిల్ ఈ మార్గం ద్వారా రవాణా అవుతోంది. ఇండియాకి ఈ స్ట్రెయిట్ మరింత కీలకం. మన క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో మూడింట రెండు వంతులు, ఎల్ఎన్జీ(నేచురల్ గ్యాస్) దిగుమతుల్లో సగం కంటే ఎక్కువ ఈ మార్గం ద్వారానే వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ స్ట్రెయిట్ని బ్లాక్ చేస్తే, సప్లయ్ చెయిన్లో పెద్ద సమస్యలు తలెత్తుతాయి. షిప్లు లాంగ్, ఆల్టర్నేట్ రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో డెలివరీ టైమ్, ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతాయి.
ఇండియాలో ఇవి ఖరీదవుతాయి..
ఇజ్రాయెల్– ఇరాన్ గొడవ కొనసాగితే, రోజువారి వాడే వస్తువులు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇందులో పెట్రోల్, కుకింగ్ గ్యాస్, ఎలక్ట్రానిక్స్, ఎరువులు, ఇండస్ట్రీస్లో వాడే మెషినరీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ (ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటివి), ఇండస్ట్రియల్ సాల్ట్, కెమికల్స్, ప్లాస్టిక్ ఐటెమ్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వంట నూనె, ఐరన్, స్టీల్, మెషినరీ, జ్యూవెలరీ, ప్రీషియస్ స్టోన్స్ (దిగుమతుల ఆలస్యం వల్ల) ధరలు పెరుగుతాయి. ఈ సముద్ర మార్గంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే సామాన్యులపై భారం పడుతుంది.
ఇరు దేశాలతో ఇండియా..
ఇరాన్, ఇజ్రాయెల్.. రెండు దేశాలతో ఇండియాకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. వీళ్ల మధ్య గొడవ ఉన్నప్పటికీ బ్యాలెన్స్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్తో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ, కెమికల్స్, ఫర్టిలైజర్స్లో భారత్ వ్యాపారం చేస్తోంది. ఇరాన్తో పండ్లు, కెమికల్స్, సిమెంట్, సాల్ట్, ఫ్యూయల్ సంబంధిత ప్రొడక్ట్స్లో ట్రేడ్ చేస్తోంది.
మార్చి 2024-2025 ట్రేడ్ డేటా ప్రకారం, ఇరాన్కు ఇండియా ఎగుమతులు ఏడాది లెక్కన 47.1 శాతం పెరగగా, ఇరాన్ నుంచి దిగుమతులు 23.6 శాతం తగ్గాయి. ‘‘సప్లయ్ సమస్యల రిస్క్ని తగ్గించు కోవడానికి ఇండియా రెడీగా ఉండాలి. ఇంధన కొనుగోళ్లను ఒకే దేశం నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి జరపాలి. ఇతర ట్రేడ్ రూట్లను అన్వేషించాలి. క్రూడాయిల్కు బదులు ఇతర ఇంధనాలను ప్రమోట్ చేయాలి” అని నిపుణులు సలహా ఇస్తున్నారు.