- బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడులోని 8 జిల్లాల్లో 410 కి.మీ. అదనపు రైల్వే లైన్లు
- బిహార్లో ఎన్హెచ్-22 కింద
- 82 కి.మీ. మేర ఫోర్ లేన్గా అప్గ్రేడ్
- మొత్తం రూ. 13,041 కోట్ల అంచనా వ్యయం
- కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో చేపట్టనున్న రూ. 13,041 కోట్ల విలువైన 5 ప్రాజెక్ట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో నాలుగు రైల్వే ప్రాజెక్ట్లు, ఒక హైవే ప్రాజెక్ట్ ఉన్నాయి. బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ ప్రాజెక్టులను ఆమోదించింది. సమావేశం తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలలోని 8 జిల్లాలను కవర్ చేసే నాలుగు రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్లను కేబినెట్ ఆమోదించినట్లు తెలిపారు. ఖరగ్పూర్ –భద్రక్ 4వ లైన్, భద్రక్– హరిదాస్పూర్ 4వ లైన్, గూడూరు–గుమ్మిడిపూండి 3, 4వ లైన్లు, కటక్–పారాదీప్ 3, 4వ లైన్లు ఇందులో ఉన్నాయని చెప్పారు. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్కు సుమారు 410 కిలోమీటర్లు అదనంగా కలుస్తుందని వెల్లడించారు.
సుమారు రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్ట్లు 2030-–31 నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు. అలాగే బీహార్లోని ఎన్హెచ్-22 కింద ముజఫర్పూర్–సీతామర్హి–సోన్బర్సా సెక్షన్ను నాలుగు వరుసలుగా అప్గ్రేడ్ చేయడానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద రూ. 3,590 కోట్లకు పైగా మూలధన వ్యయంతో 82.57 కిలోమీటర్ల ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వివరించారు.
కనెక్టివిటీ, టూరిజం పెరుగుతయ్: మోదీ
తమిళనాడు, ఏపీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో చేపట్టనున్న నాలుగు రైల్వే ప్రాజెక్ట్లు, బిహార్లో చేపట్టనున్న నాలుగు లేన్ల హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, బెంగాల్లలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి పెద్దపీట వేసినట్లు మోదీ తెలిపారు.
‘‘భారతీయ రైల్వే నెట్వర్క్కు ముఖ్యమైన సామర్థ్యాన్ని జోడిస్తూ, లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చే 4 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్లను కేబినెట్ ఆమోదించింది. ప్రయాణీకులు, సరుకు రవాణాను బలోపేతం చేయడం, రద్దీని తగ్గించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడం, మెరుగైన కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకం వంటి అనేక ప్రయోజనాలు ఈ ప్రాజెక్ట్ల ద్వారా కలుగుతాయి’’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి కనెక్టివిటీ వేగంగా విస్తరించడం అత్యంత అవసరమని ప్రధాని అన్నారు.
6,448 గ్రామాలకు మెరుగైన కనెక్టివిటీ
బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలలోని 8 జిల్లాలను కవర్ చేసే ఈ 4 ప్రాజెక్ట్లు సుమారు 60 లక్షల జనాభా కలిగిన 6,448 గ్రామాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి ఒడిశాలోని భద్రక్ (రాణితాల్) వరకు 173 కిలోమీటర్ల మేర నాలుగో లైన్ నిర్మాణం, భద్రక్– హరిదాస్పూర్ మధ్య 75 కిలోమీటర్ల మేర నాలుగో లైన్ నిర్మాణ పనులను చేపట్టనున్నారు. అలాగే, ఏపీలోని గూడూరు– తమిళనాడులోని గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్లు, ఒడిశాలోని కటక్ –పారాదీప్ మధ్య 72 కిలోమీటర్ల మేర మూడో, నాల్గవ లైన్ల ఏర్పాటు ఈ ప్రాజెక్ట్లలో భాగంగా ఉన్నాయి.
మంత్రుల సోషల్ మీడియా పనితీరుపై సమీక్ష
కేంద్ర మంత్రుల సోషల్ మీడియా పర్ఫార్మెన్స్పై కూడా కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా సమీక్షించినట్టుగా జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రుల సోషల్ మీడియా పనితీరుకు సంబంధించిన ర్యాంకులను వెల్లడించగా, మోదీ అగ్రస్థానంలో నిలిచారని వెల్లడించాయి. జాతీయ నాయకులు సోషల్ మీడియాలో సాధిస్తున్న రీచ్కు సంబంధించిన వివరాలతో ఒక నివేదికలను కూడా మంత్రులకు అందజేశారు.
ఇది మంత్రులు తమ పనితీరును ఇతరులతో పోల్చుకోవడానికి వీలు కల్పిస్తుందని, ప్రతి మంత్రికీ వ్యక్తిగత నివేదికలను అందజేశారని సమాచారం. ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్లలో గత మూడున్నర నెలలుగా మంత్రుల కార్యకలాపాల ఆధారంగా ఈ పనితీరు నివేదికలను రూపొందించారు. రోజువారీ సగటు పోస్ట్లు, మొత్తం ఎంగేజ్మెంట్, ప్రతి పోస్ట్కు సగటు ఎంగేజ్మెంట్, మొత్తం లైక్లు, సగటు లైక్లు, ఫాలోవర్ల సంఖ్య వంటి మెట్రిక్స్ ఆధారంగా మొత్తం ర్యాంకులను, పనితీరు నివేదికలను నిర్ణయించారు.
అలాగే, సోషల్ మీడియా పనితీరుపై మంత్రులకు ఈ సమావేశంలో అవగాహన కూడా కల్పించినట్టుగా తెలిసింది. కాగా, ‘ఎక్స్’ వేదికను ఎక్కువగా ఉపయోగించే ప్రధాని మోదీ, సీజేపీ నేతృత్వంలో నిరసనలు ఉధృతంగా సాగుతున్న సమయంలో యువత ఎక్కువగా ఇష్టపడే మాధ్యమాన్ని చేరుకోవడానికి జులై 23న తన మొదటి వర్టికల్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో విడుదల చేశారు.
