
అఫ్గానిస్థాన్ను తాలిబన్లు చెర పట్టడంతో ఆ దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. దీని ప్రభావం ఒక్క అఫ్గాన్ పైనే కాకుండా ప్రపంచ దేశాలపైనా పడుతోంది. అనేక దేశాల ప్రజలకు అక్కడ చిక్కుకుని ఉండడంతో వారి తరలింపు ఓ వైపు ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు తాలిబన్ల అకృత్యాలు భరించలేమన్న భయంతో అఫ్గాన్లు కూడా ఇతర దేశాల ఆశ్రయం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ క్రైసిస్పై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ పిలవాలని నిర్ణయించింది. ఈ పరిణామాలపై గురువారం (ఆగస్టు 26న) ఉదయం 11 గంటలకు అన్ని ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించేందుకు పిలుపునిచ్చింది.
ఇప్పటికే అఫ్గాన్లో నెలకొన్న పరిస్థితులు, భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అవలింబిస్తున్న విధానం వంటి అంశాలపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు వివరించాలని ప్రధాని మోడీ మన విదేశాంగ శాఖకు ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రస్తుతం అఫ్గాన్లో నెలకొన్న క్రైసిస్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రతిపక్ష నేతలకు వివరించాలని ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ శాఖను ఆదేశించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తర్వాతి డెవలప్మెంట్స్ తెలియజేస్తారు” అని ఆయన పోస్ట్ చేశారు.