న్యూఢిల్లీ: మరో ఎనిమిది దేశాల్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ని అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు సంబంధించి చర్చలు మొదలు పెట్టామని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ ఎం నాగరాజు శుక్రవారం పేర్కొన్నారు. తాజా లిస్ట్లో ఈస్ట్ ఏషియా దేశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం భూటాన్, సింగపూర్, ఖతార్, మారిషస్, నేపాల్, యూఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్లో యూపీఐని అంగీకరిస్తున్నారు.
త్వరలో మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో యూపీఐ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా యూపీఐని వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా చేర్చే ప్రయత్నం కూడా జరుగుతోందని నాగరాజు అన్నారు. ఇతర దేశాల్లో కూడా యూపీఐ అందుబాటులోకి వస్తే భారతీయులు విదేశాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరపగలుగుతారు.
బిజినెస్లు కూడా తక్కువ ఖర్చుతో, వేగంగా, సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. కాగా, యూపీఐని ఇతర దేశాలు తమ డిజిటల్ పేమెంట్ మోడల్గా స్వీకరించడానికి ఆసక్తి చూపుతున్నాయి.
