
- భవిష్యత్తులో మళ్లీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు
- బ్లాక్ బాక్స్లోని డేటా డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుంది
- రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయా.. బాధితుల ఆవేదనను అర్థం చేసుకోగలను
- డెడ్బాడీలకు వేగంగా డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నయ్.. మృతదేహాలను వీలైనంత త్వరగా అందజేస్తాం
- మీడియాకు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ 270కి పెరిగిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ, వెలుగు: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఘటనకు కారణాలను పరిశీలించి, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించేందుకు గాను హైలెవల్ కమిటీని కూడా నియమించినట్టు ప్రకటించారు. అవసరమైతే ఈ కమిటీలో మరికొంత మందిని చేరుస్తామన్నారు.
ఎయిర్ సేఫ్టీపై శనివారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన సివిల్ ఏవియేషన్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మృతులకు సంతాప సూచకంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. డెడ్బాడీలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు వేగంగా జరుగుతున్నా యని, వీలైనంత త్వరగా సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ‘‘విమాన ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి బాధ నాకు అర్థమవుతోంది. నా తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అందుకే బాధితుల ఆవేదనను నేను అర్థం చేసుకోగలను” అని తెలిపారు.
విమానయాన శాఖ నిరంతరం కచ్చితమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది. అయినా, ఈ ప్రమాదం జరగడంతో బోయింగ్ 787 సిరీస్ విమానాలపై రివ్యూ చేయాలని నిర్ణయించాం. అందుకే డీజీసీఏ ద్వారా తనిఖీలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశాం. ఎయిరిండియాలో కూలిన విమానంతో సహా మొత్తం 34 బోయింగ్ 787 సిరీస్ విమానాలు ఉండగా.. ఇప్పటికే 8 విమానాల తనిఖీలు పూర్తయ్యాయి. అన్నింటినీ తనిఖీ చేశాక భద్రతను మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలను చేపడతాం. హైలెవల్ కమిటీ దీనిపై స్టడీ చేసి, మూడు నెలల్లోపు రిపోర్ట్ అందిస్తుంది” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేశాకే..
విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ప్రమాదం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘‘ఎయిర్పోర్టుకు 2 కిలోమీటర్ల దూరంలో 650 అడుగుల ఎత్తులో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రమాద సమయంలో పైలట్ మేడే (ఎమర్జెన్సీ) కాల్ చేశారు. వెంటనే పైలట్ ను ఏటీసీ సంప్రదించినా స్పందన రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గుజరాత్ ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ శుక్రవారం సాయంత్రం దొరికింది.
దానిని డీకోడ్ చేసిన తర్వాతే అసలు ఏం జరిగిందన్నది తెలుస్తుంది” అని ఆయన వివరించారు. కాగా, హోంశాఖ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీలో సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, హోం శాఖ అడిషనల్ సెక్రటరీ, గుజరాత్ హోం, డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాల ప్రతినిధులు, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్, ఐఏఎఫ్, బీసీఏఎస్, డీజీసీఏ డైరెక్టర్ జనరల్స్, ఐబీ స్పెషల్ డైరెక్టర్, ఫోరెన్సిక్ డైరెక్టరేట్ డైరెక్టర్, ఇతర నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సోమవారం
తొలి సమావేశం నిర్వహించనుంది.