కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, కేసుల పాజిటివిటీని, కేసుల డబ్లింగ్ రేటును మానిటర్ చేయాలని తెలిపింది. అలాగే జిల్లాల్లో కొత్త క్లస్టర్లపై దృష్టి పెట్టాలని సూచించింది. 100 శాతం వ్యాక్సిన్పై దృష్టి పెట్టాలని... వ్యాక్సిన్ వేసుకోకుండా మిగిలిపోయిన వారికి కూడా కచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలని, అవసరమైతే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ చేయాలని స్పష్టం చేసింది.
ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగం పెంచాలని, అర్హులైన ప్రతీ ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. తక్కువ వ్యాక్సిన్ కవరేజీ ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పింది. రానున్న పండుగలు, వేడుకలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఆంక్షలు, నిబంధనలు పెట్టే అంశాలను పరిశీలించాలని, జనం గుమిగూడకుండా నైట్ కర్ఫ్యూలు, కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది. అలాగే కంటెయిన్మెంట్ జోన్లను, బఫర్ జోన్లను నోటిఫై చేయడంపై ఫోకస్ పెట్టాలంది కేంద్రం.