జనగామ అర్బన్/ కాశీబుగ్గ, వెలుగు : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల ఆఫీసర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్వోలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం అధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలో ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారి తరపున బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని తెలిపారు. ఈ వీసీలో వేర్వేరుగా జనగామ కలెకట్ర్ రిజ్వాన్ భాషా షేక్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, వరంగల్ కమిషనర్ చాహత్బాజ్పాయ్ ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
