కోల్కతా: అత్యధిక లాభాలు ఆర్జించడంతో బ్రోకింగ్ హౌస్లు ఎస్బీఐని మెచ్చుకుంటున్నాయని ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. దేశంలోని ఏ కార్పొరేట్ హౌస్ సంపాదించనంత లాభాన్ని ఎస్బీఐ మొదటిసారిగా సాధించిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎనలిస్టులందరూ పొగుడుతున్నారని చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ రెండో క్వార్టర్లో బ్యాంకు నికర లాభం 74 శాతం పెరిగి రూ. 13,265 కోట్లకి చేరిన విషయం తెలిసిందే. మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్లను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ఇండియన్ ఎకానమీని ఎస్బీఐ ప్రతిఫలిస్తుందని ఖారా పేర్కొన్నారు. ఎందుకంటే 47 కోట్ల మంది కస్టమర్లతో దేశంలోని ప్రతి ఇంటినీ ఎస్బీఐ చేరుకుందని చెప్పారు. 2027 నాటికి ఇండియా మూడో పెద్ద ఎకానమీగా అవతరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కస్టమర్ సర్వీస్ను బ్యాంకు ఇంకా మెరుగుపరుచుకోవల్సి ఉందని చెబుతూ, పోటీ పెరిగిన ఈ టైములో ఇది చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కస్టమర్లు కోరుకునే విధంగా ప్యాకేజ్ఆఫర్లను బ్యాంకు తేవల్సి ఉంటుందని చెప్పారు. చాలా మంది కస్టమర్లు డిజిటల్ వైపు మళ్లడంలో తమ బ్యాంకు కీలకపాత్ర పోషించిందని వివరించారు. టెక్నాలజీ లో ఎస్బీఐ భారీగా పెట్టుబడులు పెట్టిందని, యోనో యాప్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.