- ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నిక
- ఇప్పటికే 7 మున్సిపాలిటీలు కైవసం
- వర్ధన్నపేట ఇండిపెండెంట్ కాంగ్రెస్లో చేరిక.. కేసముద్రంలో లైన్ క్లియర్
- మహబూబాబాద్లోనూ అవకాశం
- ఎక్స్అఫీషియో ఓట్లతో తొర్రూర్ పీఠంపై ఫోకస్
వరంగల్, వెలుగు: మున్సిపల్ఎన్నికల్లో అసలు సిసలు ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. మాకాడ చైర్పర్సన్ ఎవరైతరో.. అంటూ ఐదారు రోజులుగా పట్టణ ప్రజల్లో ఒకటే చర్చ. సోమవారం నిర్వహించే చైర్పర్సన్ల ఎన్నికతో దానికి ఫుల్స్టాప్పడనుంది. ఉమ్మడి వరంగల్జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఓటు నమోదు చేసుకున్నారు. చైర్పర్సన్పీఠాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తమ కౌన్సిలర్లును ఇప్పటికే క్యాంపులకు తరలించగా.. ఎన్నిక జరిగే సమయానికే వారిని తీసుకురానున్నారు.
కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 1
12 మున్సిపాలిటీల్లో నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, స్టేషన్ ఘనపూర్, మరిపెడ, డోర్నకల్ డైరెక్ట్గా కాంగ్రెస్ఖాతాలోకి వెళ్లాయి. తొర్రూర్ లో మాత్రం బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది.
మరో 3 మున్సిపాలిటీల్లో లైన్ క్లియర్!
జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్ లలో హంగ్ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్పార్టీ ఇండిపెండెంట్లు, సీపీఎం నుంచి గెలిచినవారు, ఎక్స్అఫీషియో ఓట్లతో వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాబాద్ పీఠాలపై గురిపెట్టింది. వర్ధన్నపేటలోని 12 సీట్లలో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5 గెలిచాయి. 5వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి నేతావత్ షిబారాణి రాజేందర్ విజయం సాధించి, ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. లోకల్ ఎమ్మెల్యేగా కేఆర్.నాగరాజు ఎక్స్అఫీషియో ఓటుతో అది కాంగ్రెస్ ఖాతాలో పడినట్లయింది.
కేసముద్రంలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 8 స్థానాలు గెలిచాయి. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఎక్స్అఫీషియో ఓటుతో అది కూడా కాంగ్రెస్ అకౌంట్లో పడనుంది. మహబూబాబాద్లో 36 వార్డులుండగా.. కాంగ్రెస్ అత్యధికంగా 13, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, సీపీఐ 3, సీపీఎం 3, ఇండిపెండెంట్లు 5 చోట్ల గెలిచారు. మేజిక్ ఫిగర్ 19 కావడంతో.. సీపీఎం 3, ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎక్స్అఫీషియో ఓటుకుతోడు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
తొర్రూర్ లో బీఆర్ఎస్కు బలం
తొర్రూర్ మున్సిపాలిటీలో 16 స్థానాలకు గాను 9 బీఆర్ఎస్, 7 హస్తం పార్టీకి దక్కాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్అఫీషియో ఓట్లతో సమానం అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి ఎవరో ఒకరి మద్దతుతో చైర్పర్సన్స్థానాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్అడుగులు వేస్తోంది.
ములుగులో ఇద్దరికి చెరో రెండున్నరేళ్లు?
ములుగు, వెలుగు: ములుగు జిల్లా ఏర్పడిన ఆరేండ్లకు ఏర్పాటైన మున్సిపాటిటీలో తొలి చైర్ పర్సన్పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి12 మంది, బీఆర్ఎస్నుంచి ఐదుగరు, బీజేపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్రెబల్ అభ్యర్థులే కావడంతో తమ పార్టీ బలం 14కు చేరిందని మంత్రి సీతక్క ప్రకటించారు. ఆమె ఎక్స్అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. చైర్పర్సన్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లలో నలుగురు తమకంటే తమకంటూ పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి కోడలు 8వ వార్డు కౌన్సిలర్ స్వాతి భరత్కు చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు మంత్రి నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి సతీమణి చంద్రకళ ఆరో వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది, చైర్ పర్సన్పదవి ఆశిస్తున్నారు. దీంతో చెరో రెండున్నరేళ్లు పదవిని అప్పగించేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం ఉదయం ములుగు కలెక్టరేట్ లో ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
