గతేడాదితో పోలిస్తే టెంపరేచర్ పెరిగే చాన్స్
పదేళ్లలో 42 -44 డిగ్రీలుగా నమోదు
ఈసారి 45 డిగ్రీలు ఉండొచ్చు
సిటీ వాతావరణ శాఖ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది సమ్మర్ సీజన్ కొద్దిరోజుల్లోనే షురూ కానుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సిటీ లో సమ్మర్ మరింత హీట్గా ఉండనుంది. దాదాపు 42 నుంచి 45 డిగ్రీల ఉష్టోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత10 ఏళ్లలో సిటీలో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మునుపటితో పోలిస్తే ఈసారి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగే చాన్స్ ఉండొచ్చని తెలిపారు. ఈ ఏడాది వానాకాలం, చలికాలం రెండు సీజన్లు మాములుగానే ఉన్నాయి. వర్షాకాలంలోనైతే ఏకంగా వందేళ్ల నాటి వరదలను గుర్తు చేస్తూ భారీగా వానలు పడ్డాయి. దీంతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. వరదలతో సిటీ ఆగమైంది. ఇలాగే సమ్మర్లో కూడా టెంపరేచర్ అధికంగానే ఉంటుందని అనుకుంటుండగా, వాతావరణ శాఖ కూడా ఇదే చెబుతుంది.
మామూలు నుంచి అధికంగా..
ఈసారి ఎండలు మోస్తరు నుంచి అధికంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నాం. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉంది. ఫోర్ కాస్ట్ రిపోర్ట్ ని కూడా రెడీ చేస్తున్నాం. ఏ నెలలో ఎంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేది, వడగాల్పులు, తీవ్రగాల్పులు ఎలా ఉండనున్నాయోననే సమాచారంలో రిలీజ్ చేస్తాం. వచ్చే పదిరోజులు ఎలా ఉంటుంది అనేది కూడా ముందే ఫోర్ కాస్ట్ రెడీ చేసి ప్రజలకు తెలియజేస్తాం. – నాగరత్న, సైంటిస్ట్- ఈ అండ్ హెడ్, వాతావరణ శాఖ, హైదరాబాద్