
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్టు ఇస్రో శాస్త్రవెత్తలు తెలిపారు. దీని కోసం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు కీలక ప్రక్రియ చేపట్టారు. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం ఈ ప్రయోగంలో అత్యంత కీలకమని దాన్ని విజయవంతంగా పూర్తిచేశమని తెలిపారు. ఇందుకోసం ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్ ను మండించామన్నారు. గత నెల 22న శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జీఎస్ ఎల్ వీ- మార్క్ 3 ఎం1 ద్వారా చంద్రయాన్ -2 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. 29 రోజుల తర్వాత ఇవాళ అది చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది.
సెప్టెంబరు రెండో తేదీన ల్యాండర్ పై రెండు ఆపరేషన్స్ చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవెేత్తలు. ఫలితంగా సెప్టెంబరు 7వ తేదీ తెల్లవారుజామున సాఫీగా ల్యాండర్ ల్యాండింగ్ కానుంది. ఆర్బిటర్, ల్యాండర్ లో ఏర్పాటు చేసిన కెమెరాలు ల్యాండింగ్ ప్రాంతాన్ని రియల్ టైమ్ లో చిత్రాలను తీసి పంపనున్నాయి. ల్యాండర్ కింద ఉండే కెమెరాలు ల్యాండింగ్ స్థలాన్ని అధ్యయనం చేసి అక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటే ల్యాండ్ చేస్తాయి. ల్యాండర్ దిగిన తర్వాత అందులోని ఆరుచక్రాల రోవర్ దాదాపు నాలుగు గంటల తర్వాత బయటకు వస్తుంది. ఇది సెకనుకు సెంటీమీటరు వేగంతో పయనిస్తుంది. 14 రోజుల్లో 500 మీటర్ల దూరం చంద్రునిపై పయనించనుంది. అది అక్కడ తీసిన డేటా మొత్తాన్ని ల్యాండర్ ద్వారా 15 నిమిషాల్లో భూమిపై చేరవేయనుంది.