నాసాకు విక్రమ్​ కనిపియ్యలె

నాసాకు విక్రమ్​ కనిపియ్యలె
  • ల్యాండింగ్​ ప్రాంతం ఫొటోలు విడుదల.. చీకటిగా ఉందని వెల్లడి
  • అక్టోబర్​లో వెలుతురు వచ్చాక మరోసారి ఫొటోలు తీస్తామన్న సంస్థ

నాసా కంటికీ విక్రమ్​ కనిపించలేదు. చంద్రుడి దక్షిణ ధ్రువం మొత్తాన్ని నాసా లూనార్​ రికనైసెన్స్​ ఆర్బిటర్​ (ఎల్​ఆర్​వో) జల్లెడ పట్టినా మన విక్రమ్​ జాడ దొరకలేదు. కారణం, అక్కడ మొత్తం ఇప్పుడు చీకటిగా ఉండడమే. కొద్ది రోజుల క్రితం ఆ ఏరియాను నాసా ఆర్బిటర్​ ఫొటోలు తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫొటోలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్​ 7న సింపెలియస్​ ఎన్​, మాంజినస్​ సీ లోయల మధ్య విక్రమ్​ ల్యాండింగ్​కు ఇస్రో ప్రయత్నించినా అది ఫెయిలైంది. విక్రమ్​తో లింక్​ను తిరిగి కలిపేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా కూడా ప్రయత్నించింది. అది ఫలించకపోవడంతో దాని జాడ కనుక్కునేందుకు రెండు అంతరిక్ష సంస్థలు ప్రయత్నించాయి. అందులో భాగంగా చంద్రయాన్​ 2 ఆర్బిటర్​, నాసా ఆర్బిటర్​ విక్రమ్​ సాఫ్ట్​ ల్యాండ్​ కావాల్సిన ప్రాంతాన్ని ఫొటోలు తీశాయి.

ఇస్రో తాను తీసిన ఫొటోలు ఇంకా విడుదల చేయకపోయినా, నాసా మాత్రం శుక్రవారం వాటిని రిలీజ్​ చేసింది. దక్షిణ ధ్రువానికి జస్ట్​ 600 కిలోమీటర్ల దూరంలోని ఆ రెండు లోయల ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్టు చెప్పింది. చంద్రుడి నేలను విక్రమ్​ బలంగా ఢీకొట్టిందని వెల్లడించింది. అయితే, మొత్తం చీకటి ఉండడం వల్ల అక్కడ విక్రమ్ జాడ దొరకలేదని చెప్పింది. దానిని గుర్తించేందుకు అక్టోబర్​ 14న మరోసారి ఆ ప్రాంతాన్ని ఆర్బిటర్​తో ఫొటో తీస్తామని తెలిపింది. ఆ టైంకు అక్కడ వెలుతురు వస్తుందని, అప్పుడు ఫొటోలు తీస్తే విక్రమ్​ జాడ దొరికే అవకాశం ఉంటుందని గొడ్డార్డ్​ స్పేస్​ఫ్లైట్ సెంటర్​ సైంటిస్ట్​, ఎల్​ఆర్​వో డిప్యూటీ ప్రాజెక్ట్​ సైంటిస్ట్​ జాన్​ కెల్లర్​ తెలిపారు. ల్యాండింగ్​ ప్రాంతాన్ని ఫొటో తీసినప్పుడు మొత్తం చీకటిగా ఉందని, కాబట్టి అక్కడి నేల మొత్తం నీడ చాటున ఉందని నాసా ట్వీట్​ చేసింది. బహుశా ఆ నీడల మాటునే విక్రమ్​ ఉండి ఉండొచ్చని పేర్కొంది. మళ్లీ అక్టోబర్​లో ఎల్​ఆర్​వో ఆ ప్రాంతం మీదుగా వెళుతుందని, అప్పుడు లైటింగ్​ మంచిగా ఉంటుంది కాబట్టి మరోసారి ఫొటోలు తీస్తామని తెలిపింది. వీలైతే విక్రమ్​నూ ఫొటోలు తీస్తామని చెప్పింది.