- కరోనా, లాక్డౌన్ ఎఫెక్టులతో ఇండియన్ల అలవాట్లలో మార్పు
- టీవీ తెగ చూస్తున్నరు.. అందులో న్యూస్కే ప్రయార్టీ ఇస్తున్నరు
- చాలా మంది న్యూస్పేపర్ కావాలంటున్నరు
- ఎనార్మస్ బ్రాండ్స్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కూరగాయల కోసమో, కిరాణా దుకాణానికో వెళ్లినప్పుడు ఏదో ఓ కొసరు అడిగే అలవాటున్న చాలా మంది ఇండియన్స్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. అట్లనే, సరుకులు కొనేప్పుడు వాటి రేట్లు కూడా అడగడం లేదట. అసలు బేరమాడుతలేరట. పెద్ద వయసు వాళ్లు కూడా కరెన్సీ వాడటం తగ్గించి డిజిటల్ పేమెంట్లు చేస్తున్నరట. లాక్ డౌన్ ఎఫెక్ట్తో అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయని ఎనార్మస్ బ్రాండ్స్ సర్వే తేల్చింది.
కూరగాయలు కొన్నప్పుడో, కిరాణా దుకాణాల్లోనో ఏవైనా కొన్న తర్వాత.. కొంత కొసరు అడిగే అలవాటు మనోళ్లలో చాలా మందికి ఉంది. ఇక ఏదైనా సరే ముందు రేటు అడగనిదే ముట్టుకోరు కూడా. కానీ ఇప్పుడు ఇండియన్స్ లో చాలా మంది రేట్ల గురించి అడగడం లేదని సర్వే పేర్కొంది. ఈ సర్వే కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, అహ్మదాబాద్లలో 3,737 మందిని ప్రశ్నించినట్టు ఎనార్మస్ బ్రాండ్స్ తెలిపింది. మార్చి 30– ఏప్రిల్ 22 మధ్య సర్వే చేశామని పేర్కొంది.
న్యూస్కే డిమాండ్
లాక్డౌన్ టైంలో టీవీ చూడటం బాగా ఎక్కువైందని, 43% మందికి టెలివిజనే మంచి కాలక్షేపమైందని సర్వే పేర్కొంది. న్యూస్ ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చేరింది. మన వాళ్లు టీవీ చూసే మొత్తం టైములో 63% న్యూస్ చానెల్స్నే చూస్తున్నారట. ఇండియాలోని యువత ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటున్నారని తేలిందని ఎనార్మస్ బ్రాండ్స్ మేనేజింగ్ పార్ట్నర్ అజయ్ వర్మ చెప్పారు. లాక్డౌన్ సమయంలోనూ మన యువతలో ఆశావాదం కనబడుతోందని తెలిపారు. ఇక డైలీ న్యూస్ పేపర్ను బాగా మిస్సవుతున్నామని 74 % మంది ఈ సర్వేలో చెప్పారు. దీంతో న్యూస్ పేపర్లు తిరిగి మంచి పొజిషన్కు చేరుకుంటాయని భావిస్తున్నారు. 29 % మంది ఆన్లైన్ న్యూస్ పేపర్ల వైపు మళ్లారని, 4 % మందే న్యూస్ పేపర్లకు సబ్స్క్రిప్షన్ మానేశారని తేలింది. పేపర్ అలవాటు కాఫీ లాంటిదేనని, వదులు కోవడం కష్టమేనని సర్వేలో తేలినట్లు ఎనార్మస్ బ్రాండ్స్ పేర్కొంది.
పెద్దోళ్లూ టెక్నాలజీ వాడుతున్నరు
పాలు, కిరాణా సరుకులు వంటివి ఆర్డర్ చేయడానికి పెద్ద వయసు వాళ్లు కూడా ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నారని ఎనార్మస్ బ్రాండ్స్ సర్వే తెలిపింది. కూరలు, ఇతర వస్తువులను రేట్లెంతో అడగకుండానే కొంటామని సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది చెప్పారని పేర్కొంది. వీలైనంత వరకు బేరమాడే ఇండియన్ల అలవాటుకు ఇది పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపింది. ఇక 55 నుంచి 65 ఏండ్ల వయసున్న పెద్దవాళ్లలో కూడా డిజిటల్ టెక్నాలజీ వాడకం 47 శాతం ఎక్కువైనట్లు వెల్లడించింది. పాలు, కిరాణా వంటి అత్యవసర సరుకుల కోసం వారు ఆన్లైన్ వైపు మళ్లినట్టు వివరించింది. ఇక ట్రాన్సాక్షన్స్ కోసం యూపీఐ, వ్యాలెట్స్ వంటివి వాడుతున్నారని తెలిపింది. వాస్తవానికి బ్యాంకులు దాదాపు పదేళ్లుగా ఆన్లైన్ బ్యాంకింగ్ పెంచాలని ప్రయత్నిస్తుండగా.. ప్రస్తుత పరిస్థితి దానికి ఊతమిచ్చింది. కిందటి నెలలోనే ఫస్ట్ టైమ్ యూజర్ల సంఖ్య ఒక్కసారిగా 28 శాతం పెరిగింది. ఇందులో కూడా పెద్ద వయసు వాళ్లే 33 శాతం ఉన్నట్లు తేల్చింది.